బ్యాటరీ సైకిల్ క్రియేటర్ సిద్ధూని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అభినందించారు.
వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించారు. వెనుక సీటుపై కూర్చోబెట్టుకుని సిద్ధూ ఆవిష్కరించిన సైకిల్ ని స్వయంగా నడిపారు. అతని ఆలోచనలు తెలుసుకుని అబ్బురపడ్డారు. నూతన ఆవిష్కరణలకు పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ రూ.లక్ష ప్రోత్సాహకంగా అందించారు.
మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో అతని సృజనాత్మకతను తెలుసుకుని పవన్ స్వయంగా పిలిపించుకుని మరి మెచ్చుకున్నారు.