కాకినాడ జీజీహెచ్ లో కామపిశాచులు! సీఎం చంద్రబాబు ఆదేశాలతో నలుగురిపై వేటు!!
కాకినాడ జీజీహెచ్లో దారుణం జరిగింది. చదువు కోసం వచ్చిన పారా మెడికల్ విద్యార్థినులపై బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్గా పని చేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఆర్ఎంసీ రెగ్యులర్ ఉద్యోగి వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించారు. ఈ విషయాన్ని విద్యార్థినులు ఆర్ఎంసీ ప్రిన్సిపాల్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు పంపారు. ఒక హెచ్వోడీ, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ ఈ నెల 9, 10వ తేదీలలో 48 మంది విద్యార్థులను విచారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ చక్రవర్తితో పాటు అతడికి సహకరించిన మైక్రోబయాలజీ ల్యాబ్ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ గోపాలకృష్ణ, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్లను విచారించింది.
విద్యార్థినులు ఆరోగ్య పరీక్షల్లో నిమగ్నమై ఉండగా వారికి తెలియకుండా వారి శరీర భాగాలు ఫొటోలు తీసి వారికే వాట్సాప్ చేసే వాడనీ, వాటిని మరెవరికీ షేర్ చేసి తమ బాధ బయటికి చెప్పుకునే అవకాశం లేకుండా వన్ టైం వ్యూ ద్వారా పంపేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను చెప్పినట్లు వినకపోతే, పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని బెదిరించాడని కళ్యాణ్ చక్రవర్తిపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ తంతు అంతటికీ జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాలతో జీజీహెచ్లో వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.ల్యాబ్ అటెండెంట్ కల్యాణ్ చక్రవర్తితో పాటు టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నలుగురిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై నివేదికతో పాటు, తీసుకున్న చర్యలను కాకినాడ జీజీహెచ్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశారు.