పవన్ కళ్యాణ్ సవాల్.. నేను సిద్ధమన్న లోకేష్..!
* మెగా పీటీఎం వేదికగా నారా లోకేష్ ప్రకటన
* కోటి మొక్కలు నాటాలని పవన్ సవాల్
* పవన్ అన్న సవాల్ స్వీకరిస్తున్నానన్న మంత్రి లోకేష్
* ఒక్క విద్యాశాఖలోనే కోటి మొక్కలు నాటుతామని వెల్లడి
అవును ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్, టీచర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబుతో కలిసి నారా లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్.. ప్రధాని మోడీ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారని.. ప్రధాని పిలుపుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కోటి మొక్కలు నాటాలని సవాల్ విసిరారని గుర్తు చేశారు.
తన అన్న సమానుడైన పవనన్న సవాల్ను స్వీకరిస్తున్నట్టు మీటింగ్ వేదికపై నుంచి లోకేష్ ప్రకటించారు. ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతామన్నారు. మూడేళ్లు ఆ మొక్కలను పెంచే బాధ్యత స్కూలు పిల్లలు తీసుకుంటారన్నారు. ఇందుకోసం పిల్లలకు గ్రీన్ పాస్ పోర్టు ఇచ్చాం. పిల్లలు మొక్కలను పెంచడం బాధ్యతగా భావించాలి. మూడేళ్ల తర్వాత గ్రీన్ పాస్ పోర్టుపై స్కూల్ ప్రిన్సిపల్ సంతకం పెడతారని లోకేష్ తెలిపారు.
కొద్ది రోజుల క్రితం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని అనంతవరంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు తన వంతుగా వచ్చే ఏడాది ఇదే రోజు నాటికి రాష్ట్రంలో కనీసం కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నానని పవన్ ప్రకటించారు. మేం మొక్కలు నాటుతున్నాం.. మీరు నాటేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఇప్పుడు ఆ చాలెంజ్ ను లోకేష్ స్వీకరించారు. పర్యావరణహితమైన కార్యక్రమంపై పవన్ చేసిన సవాల్ లోకేష్ స్వీకరించి ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారని పార్టీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.