తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు.. కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా?
పొత్తులపై ఆలోచిస్తున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
స్థానిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే యోచన?
పొత్తు పొడుస్తుందా.. ప్రచారంగా మిగిలిపోతుందా..?
Srikanth Gurram
TPN, Hyderabad
తెలంగాణ రాజకీయాలు మళ్లీ కొత్త మలుపులు తిరుగబోతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గట్టి వ్యూహాత్మక ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో.. బీఆర్ఎస్ పొత్తుపై గుసగుసలు, ఊహాగానాలు, మంతనాలు జోరందుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ చర్చలు ఊపందుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన గులాబీ బాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీతో పొత్తు వల్ల స్థానిక సంస్థల్లో ప్రభావం పెరిగే అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రి లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పొత్తు పొడిస్తే తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో పునరుద్ధరణ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేయొచ్చని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో కారు పార్టీకి మద్దతు తగ్గుతోందన్న అనుమానాల మధ్య, బలహీనమైన ప్రాంతాల్లో బీజేపీతో పొత్తు వల్ల స్థానిక సంస్థలలో తమ పట్టు కోల్పోకుండా ఉండొచ్చని ఆయన భావిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఈ తరహా పొత్తు ద్వారా ప్రాంతీయ అధికారాన్ని నిలుపుకోవడమే కాక, భవిష్యత్తు లోక్సభ ఎన్నికల దిశగా ప్రణాళికలు వేయవచ్చని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఇదిలా ఉండగా బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం చూస్తే బీజేపీ.. బీఆర్ఎస్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు, సీబీఐ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుందని.. రాజకీయ ఒత్తిడికి మద్దతుగా మారవచ్చని చర్చలు జరుగుతున్నాయి.
బీజేపీ మాత్రం బీఆర్ఎస్తో రాజకీయంగా పొత్తు పెట్టుకునేందుకు మౌనంగా వ్యవహరిస్తోంది. బీజేపీ.. బీఆర్ఎస్ పార్టీలకు రాష్ట్ర స్థాయిలో వేర్వేరు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. అయితే స్థానిక స్థాయిలో లాభసాటి పొత్తులు చేసుకోవడం ద్వారా పరస్పర ప్రయోజనాలను సాధించాలనేది ఇరు పార్టీల ఆలోచనగా కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో విజయం సాధించేందుకు బీఆర్ఎస్ మద్దతు అవసరమవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ బలహీనంగా ప్రాంతాల్లో బీజేపీ మద్దతుతో విజయం సాధించాలన్న ప్రయత్నం కనిపిస్తోంది.
ఇన్ని పరిణామాల మధ్య బీజేపీ.. బీఆర్ఎస్ పొత్తు చర్చలు కేవలం ప్రచారం మాత్రమేనా?. లేక దాని వెనుక రాజకీయ లెక్కలున్నాయా అన్నది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. గతంలో ఒకరికొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న పార్టీలు, ఇప్పుడు పరస్పర ప్రయోజనాల కోసం కమలం.. కారు.. చేయి కలపడం ప్రజలకు ఏమాత్రం న్యాయంగా అనిపించకపోవచ్చు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న వాదన తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తు చేస్తూ.. వీటి వెనుక వ్యూహాలు ఎలా ఉన్నా.. చివరికి ప్రజలే తీర్పు చెబుతారు. కాబట్టి ఈ పొత్తు ప్రచారంగానే మిగిలిపోతుందా? లేక రాజకీయంగా రాజకీయ లావాదేవీకి నాంది అవుతుందా? అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.