ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
సున్నం చెరువులో అడ్డదిడ్డంగా బోర్లు..
మంచినీరు అంటూ సరఫరా చేస్తున్న వ్యాపారులు..
తాగితే పోతారు అంటున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు..
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
అదో విఐపి జోన్.. నిత్యం అధికారులు.. మంత్రులు, ముఖ్యమంత్రి రాకపోకలు సాగిస్తూ వుంటారు.. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాలు, పార్క్ లు ఫుల్.. ఇక భూముల ధరలు ఆ రేంజ్ లోనే ఉంటాయి. అయితే అక్కడ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.. ఆఫీసులకు, నివాసం వుండే వారికి మంచినీళ్లు మాత్రం అంతంత మాత్రమే. పోనీ బోర్లు వేస్తే నీళ్లు వస్తాయా అంటే అది ఉండదు. అందుకే అక్కడి వారు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఆ నీరు ఎంత వరకు సేఫ్ అంటే మాత్రం ఎవ్వరు చెప్పలేరు.
మాదాపూర్ , హైటెక్ సిటీ, కొండాపూర్, కాకతీయ హిల్స్ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీరు విషపూరితమైంది. ఇది ముమ్మాటికీ నిజం.
మాదాపూర్ లోని సున్నం చెరువును ఇటీవల హైడ్రా అధికారి రంగనాథ్ సందర్శించారు. అక్కడ ఆక్రమణలను సైతం తొగించారు. చెరువును తిరిగి పునరుద్ధరణ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపి చెరువు ప్రక్షాళన మొదలు పెట్టారు. అయితే రంగనాథ్ ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు విస్సుపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో కొందరు వ్యాపారులు ఇష్టానుసారంగా సున్నం చెరువులో బోర్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారని తెలుసుకున్నారు. ఆ నీరు ఎంతవరకు సేఫ్ అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను కోరారు. ఆ అధికారులు నీటిని పరీక్షించి అవి తాగినా, వాడిన ప్రాణాలకే ప్రమాదం అంటూ హెచ్చరించారు. దీనితో హైడ్రా ప్రాణాంతకమైన వ్యాపారానికి చెక్ పెట్టింది. వీటిపై పర్యవేక్షణ బాధ్యత సంబంధిత అధికారులకు అప్పగించింది. కొద్దిరోజుల వరకు నీటి అక్రమ వ్యాపారానికి చెక్ పడింది. కొద్దీ నెలల వరకు ఆగిపోయిన వ్యాపారం అధికారులకు కాసుల వర్షం కురిపించడంతో ఇంకేముంది మళ్లీ మొదలైంది. ఒకపక్కన చెరువు ప్రక్షాళన జరుగుతుండగా మరోపక్కన నీటి వ్యాపారం మళ్లీ మొదటికె వచ్చింది. అడ్డగోలుగా ట్యాంకర్ల ద్వారా నీటి వ్యాపారం జోరందుకుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు బోర్ నీటిలో సీసం 0.073 నుంచి
0.122 ఉన్నట్లు గుర్తించింది. దీని ప్రభావం పిల్లల మెదడు చురుకుదనంపై పడుతుందని, జ్ఞాపకశక్తిని తగ్గించి, రక్తహీనతకు కారణమవ్వడమే కాదు బాల్యం, యవ్వన దశలోనే కిడ్నీలపై ఎఫెక్ట్ అవుతుందని తెలిపింది. ఇక డాక్టర్లు ఈ నీటిని ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దని ఫిల్టర్ చేసి వాడిన మూత్రపిండాలపై పడుతుందని, క్యాన్సర్ వ్యాధికి కూడా కారణమవుతుందని చెప్పారు. చర్మ వ్యాధులు తప్పవన్నారు. ఇంత మంది హెచ్చరించిన జనాలు, ఆఫీస్ యాజమాన్యాలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. నీటి కొరత తట్టుకోలేక ట్యాంకర్లనే ఆశ్రయిస్తున్నారు. దీనితో అక్రమ వ్యాపారులు మళ్లీ చెలరేగిపోతున్నారు.
ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారినా సున్నం చెరువు నీటి వ్యాపారానికి అధికారులు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే వ్యాపారుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. నిత్యం ఆస్పత్రుల చుట్టు ప్రదక్షిణలు చేసే కన్నా ఇలాంటి నీటి వినియోగానికి దూరంగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.