వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు
- పాలకమండలి కమిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ సీరియస్..
కాంగ్రెస్ vs బిఆర్ఎస్..
దేవాదాయశాఖ అధికారులపై మండిపాటు..
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయ పాలక మండలి కమిటీ పెద్ద వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం మారిన ప్రతిపక్ష నేతల పేర్లు మండలిలో రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. స్థానిక నేతలను వదిలి బిఆర్ఎస్ నాయకుల పేర్లు ఎలా చేర్చారంటూ మండిపడుతున్నారు. దేవాదాయశాఖ (endowment) అధికారులపై వత్తిడి తెచ్చింది ఎవరు అంటూ నిలదీస్తున్నారు. నూతన పాలక మండలిని రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి ఏడాది తరహాలోనే ఈ సారి కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఆషాఢమాసం అమ్మవారి బోనాలు, కళ్యాణం నిర్ణయించారు. ఇందుకోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ వేయాలని నిర్ణయించి దేవాదాయశాఖకి లేఖ పంపారు. అందు కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నేత కోట నీలిమ, అమీర్ పేట కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ఎస్ రావుతో పాటు పలువురు నేతలు తమకు అవకాశం కల్పించాలని తమకు చెందిన వారితో ఓ కమిటీ ఏర్పాటు చేసి లిస్ట్ తయారు చేశారు. అందుకు సంబంధించి ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనీల్ కుమార్ యాదవ్, మంత్రి కొండా సురేఖకు అందించారు. వీరంతా ఓ లిస్ట్ తయారు చేసి వడ పోసి దేవాదాయ శాఖ అధికారులకు ఓ రిపోర్ట్ అందించారు. ఇక్కడి వరకు బాగానే వుంది. శాఖ నుండి లిస్ట్ విడుదలైంది. అంతే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న దేవాలయ ప్రాంగణంలో అలజడి మొదలైంది.
పాలకమండలి కమిటీలో సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోట నీలిమ పంపిన లిస్ట్ కాకుండా బిఆర్ఎస్ నేతలు ఉమానాథ్ గౌడ్, శ్రీధర్ గౌడ్ లకు అవకాశం కల్పించారు. దీన్ని కోట నీలిమతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, ఎంపీ అనీల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ సైతం తప్పుబట్టారు. వెంటనే కమిటీని రద్దు చేయాలని దేవాదాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సాక్షాత్తు ప్రభుత్వ మంత్రులు, ఎంపీ, నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఇదేమి పట్టని అధికారులు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి సన్మానం చేయడం అమ్మవారి కల్యాణానికి ఆహ్వానం పంపడంతో దుమారం రేగేందుకు దారితీస్తోంది. గత అమ్మవారి కల్యాణ సమయంలో తలసాని చేసిన నిర్వాకం కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తలసాని గుట్కా ముమ్మడం అప్పట్లో పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. దేవాలయాలు అంటే చిన్నచూపు చూసే తలసాని అనుచరులకు పట్టంకట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేతలు ప్రశ్నిస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కమిటీ నియామకంలో దేవాదాయశాఖ అధికారులపై ఎవరు వత్తిడి తెచ్చారో జగమెరిగిన సత్యం.