టాలీవుడ్ లో ప్రకంపనలు..సినీ సెలబ్రిటీలకు ఈడీ పిలుపు
- బెట్టింగ్ యాప్స్ లో దూకుడు పెంచిన ఈడీ
పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు
విచారణకు రావాలని ఆదేశాలు
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
బెట్టింగ్ యాప్ లో ఈడీ దూకుడు పెంచింది. పలువురు సినీ ప్రముఖులకు విచారణకు రావాలని కబురు పంపింది. హాజరు కాకుండా తప్పించుకునేందుకు సాకులు చెబితే సహించేది లేదని నోటీసులో స్పష్టం చేసింది. ఇటీవల బెట్టింగ్ యాప్స్ మీద ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు 24మంది సినీ ప్రముఖులు, సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసింది. అలాగే ఈ యాప్స్ కి సంబంధించి విచారణకు రావాలని గూగుల్, మెటాలకు సైతం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పోలీసులు నమోదు చేసిన కేసు తాలూకు వివరాలు, ఆధారాలు సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు బెట్టింగ్ యాప్స్ మీద పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తోంది. సినీ ప్రముఖులకు, సెలబ్రిటీలకు, యూట్యూబర్లకు హవాలా ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించింది. ఇందులో భాగంగా విచారణ చేపట్టి దీని మూలాలు వెలికితీయాలని సెలబ్రెటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న సెలబ్రిటీలు రానాను జూలై 23 విచారణకు రావాలని, ప్రకాష్ రాజ్ జూలై 30న విచారణకు హాజరుకావాలని అలాగే మంచు లక్ష్మి ఆగస్ట్ 13న విచారణకు రావాలని ఈడి నోటీసులో పేర్కొంది. వీరితో పాటు మిగతా వ్యక్తులను సైతం విచారణ చేపట్టాలని భావిస్తోంది. విచారణకు వచ్చే రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, ఆడిట్ బుక్స్, ఆడిటర్లతో హాజరు కావాలని తెలిపింది. ఈడీ నోటీసులతో టాలీవుడ్ లో మరోసారి ప్రకంపనలు మొదలైనాయి.