జుపే గేమ్ యాజమాన్యంపై కేసు నమోదు
బంజారాహిల్స్: ఆన్లైన్ లో లూడో ఆట ఆడి లక్షల్లో డబ్బులు కోల్పోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బంజారాహిల్స్ లోని రోస్ట్ కేఫే వద్ద చోటుచేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా జక్లేర్ గ్రామానికి చెందిన గడ్డమీడి వెంకటేశ్ (23) బంజారాహిల్స్ లోని రోస్ట్ కేఫేలో గత ఐదేళ్లుగా గార్డెనర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల "Zupee: Play Ludo Game Online" అనే ఆన్లైన్ గేమ్ కి బానిసయ్యాడు. తరచుగా ఆడుతూ, దాదాపు ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు కోల్పోయాడు. డబ్బులు కోల్పోయిన బాధతో మానసికంగా కుంగిపోయిన వెంకటేశ్, జూలై 19న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పనిచేసే ప్రదేశంలోనే విషపదార్థం సేవించాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని సహచరులు వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.ఈ ఘటనపై విక్టిమ్ సోదరుడు గడ్డమీడి భీమ్శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ లూడో గేమ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పోలీసులు Zupee గేమ్ యజమాన్యం, మేనేజ్మెంట్ పై బీఎన్ఎస్ సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.