కల్తీ ఘటనపై స్పందించిన ఎక్సైజ్.. ఆ దుకాణాల లైసెన్స్ రద్దు..
- అధికమోతాదులో అల్ఫాజోలం కలిపినట్లు నివేదిక..
మత్తు రావాలని యజమానులు చేసిన నిర్వాకం..
పోలీసులు అదుపులో 7మంది వ్యాపారులు
హైదరాబాద్: కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గత మూడురోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తత నడుమ హైదర్ నగర్, శమీమ్ గూడ, ఎంచ్ ఏంటి కాలనీతో పాటు బాలానగర్ ఎక్సైజ్ ఆఫీస్ పరిధిలోకి వచ్చే కల్లు కాంపౌండ్ ల లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 44మందిని ఆసుపత్రుల పాల్జేసి, నలుగురు మృతికి కారణమైన కాంపౌండ్ ల వద్ద శాంపిల్స్ సేకరించిన అధికారులు నారాయణగూడలో ఉన్న ల్యాబ్ కి పంపించారు. అధిక మోతాదులో అల్ఫాజోలం ట్యాబ్లెట్లు కలపడం వల్లే వారంతా అస్వస్థతకు గురయ్యారని నివేదిక అందడంతో అధికారులు లైసెన్స్ రద్దు చేశారు. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాంపౌండ్ లలో నిత్యం శాంపిల్స్ సేకరించాలని ఉన్నతాధికారులు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 7మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటన చోటుచేసుకోకుండా ఉండాలి అంటే కఠినంగా వ్యవహరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరో పక్కన ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్లక్ష్యం అని మండిపడుతున్నాయి. ముందుగానే అధికారులు చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి ఘటన ఉండేది కాదని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.