ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్: మంత్రి అచ్చెన్నాయుడు

On
ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్: మంత్రి అచ్చెన్నాయుడు

ఏలూరు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. బుధవారం ఏలూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సోలార్ విద్యుత్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి ఉచితంగా, బీసీలకు అదనపు సబ్సిడీతో ఈ సౌకర్యం లభిస్తున్నదని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.

వ్యవసాయ, అనుబంధ శాఖల కార్యాలయాలు, రైతుబజార్లు, మార్కెట్ కమిటీలకు దశలవారీగా సోలార్ పానెల్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఏలూరు మార్కెట్ యార్డ్‌ రాష్ట్రంలో ప్రముఖమైనదిగా అభివర్ణిస్తూ, మిర్చి యార్డ్‌లా ఇది కూడా పెద్ద యార్డ్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు.

ఈ సోలార్ వ్యవస్థ ద్వారా నెలకు సుమారు రూ.60,000 వరకు విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని, రెండేళ్లలో పెట్టుబడి తిరిగి వస్తుందని తెలిపారు. ప్రజలందరూ తమ ఇళ్లపై సోలార్ పానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Latest News