సొంత పార్టీ బీఆర్ఎస్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు!
ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియా చిట్ చాట్లో మాట్లాడుతూ..‘తీన్మార్ మల్లన్న నాపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలతో కవితకు కంచం పొత్తు- మంచం పొత్తు లేదంటూ ఇటీవల మల్లన్న కవితపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తర్వాత.. తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు, కవిత అనుచరులు దాడి చేశారు. అటు మల్లన్న కామెంట్స్పై అన్ని పార్టీల నేతలు మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్తో సహా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మల్లన్న కామెంట్స్ను ఖండించారు. కానీ ఇప్పటివరకు వరకు మల్లన్న వ్యాఖ్యలపై సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ నేతలు స్పందించలేదు.. కేటీఆర్ కనీసం ట్విట్టర్లో కూడా ఈ టాపిక్ను ప్రస్తావించలేదు. దీనిపై కవిత తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో అన్నివర్గాలు తనకు అండగా నిలిస్తే.. సొంత పార్టీ మాత్రం.. తనను పట్టించుకోకపోవడంపట్ల ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక, అంతకుముందు.. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. మరోవైపు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని కలిసిన కవిత.. మల్లన్న సభ్యత్వాన్ని రద్దుచేయాలని కోరారు. ఆయన వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని విన్నవించారు. మల్లన్నపై డీజీపీ కార్యాలయంలో కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఆయా చోట్ల కవిత మీడియాతో మాట్లాడారు. మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలకు కోపం వచ్చి కొందరు నిరసన వ్యక్తం చేశారని, అంతమాత్రానికే కాల్పులు జరిపి చంపేస్తారా? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్రెడ్డి స్పందించి వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆయనతో అలా మాట్లాడించింది ప్రభుత్వమే అని భావించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. కాల్పులపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్లు చెప్పారు. తాను మామూలు ఆడబిడ్డను కాదు.. అగ్గిరవ్వను అని వ్యాఖ్యానించారు. మల్లన్న వ్యాఖ్యలపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. తనను అగౌరవ పరిచిన తీన్మార్ మల్లన్నపై బీఎన్ఎస్ 74,79 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని అదనపు ఐజీ రమణకుమార్కు వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. మల్లన్న బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడతానంటే చెల్లదని స్పష్టంచేశారు. గత రెండేళ్లుగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్లు చెప్పారు. తన పోరాటం ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిందని కవిత అన్నారు.