Famous Fish: వలకు చిక్కకముందే చేపలకు అడ్వాన్స్ బుకింగ్.. ఇదెక్కడి చోద్యం.!
ఏపీలో చేపలకు ప్రీ బుకింగ్
నదిలోని చేపలకు అడ్వాన్స్
వానా కాలంలో ఫుల్ డిమాండ్
చేపలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చేపలతో పులుసు, ఫ్రై, ఇగురు ఇలా రకరకాల వంటకాలు చేసుకొని అస్వాదిస్తుంటారు. రెగ్యులర్ గా దొరికే చేపలంటే మనోళ్లు పడి చస్తారు. అలాంటిది అరుదుగా.. ఎడాదికి ఒకసారే దొరికే చేపలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదుగా. అందుకే కొందరు చేపల ప్రియులు వలకు చిక్కని చేపలకు అడ్వాన్సులిచ్చి ప్రీ బుకింగ్ చేసుకుంటున్నారు. మరి ఆంధ్రాలో అంత డిమాండ్ ఉన్న చేప ఏంటో మీకు ఇప్పటికే అర్ధమై ఉంటుంది. అదే గోదావరి పులస. పుస్తెలు అమ్మయినా పులస కూర తినాలంటారు. అందుకే ఇక్కడ పులస కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు.
ఏపీలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను నిత్యం వరదల భయం వెంటాడుతుంటుంది. జూలై నెల వచ్చిందంటే చాలు తట్టాబుట్టా సర్దుకొని పునరావాస కేంద్రాలకు పరుగులు పెడుతుంటారు జనం. కానీ వారికి ఆ బాధకంటే పులసలు దొరుకుతాయనే ఆనందమే కాసింత ఎక్కువగా ఉంటుందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ప్రతి ఏటా వానాకాలం వస్తే చాలు గోదారి లంకల్లో పులస సందడి నెలకొంటుంది. రాజమండ్రి రూరల్, ముమ్మిడివరం, యానాం, కోనసీమ లంకలు ఇలా అనేక ప్రాంతాల్లో మత్స్యకారులు పులస వేటలో ఉంటారు. గతంలో రోజుకు ఒకటి రెండు చేపలైనా వలకు చిక్కేవి. పులస చిక్కితే చాలు తమ పంటపండినట్టేనని మత్స్యకారులు భావిస్తారు. ఎందుకంటే పులసను దక్కించుకునేందుకు వేలకు వేలు ధర చెల్లిస్తారు. గోదారికి ఎదురీదడం వల్ల పులసకు మంచి రుచి వస్తుందని బలంగా నమ్ముతారు.
ఇటీవల కాలంలో పులస రాక తగ్గడంతో ఆ చేపకు ఎక్కడాలేని డిమాండ్ వచ్చిపడుతోంది. పైగా ఈ ఏడాది వానాకాలంలో ఎండలు దంచికొడుతుంటడంతో చేపలు రావడం లేదని స్థానికులంటున్నారు. అందుకే వలకు చిక్కిన ఒకటి అర చేపలను దక్కించుకునేందుకు వ్యాపారస్తులు, పులస ప్రియులు పడి చస్తున్నారు. అందుకే పులసను ఎలాగైనా దక్కించుకునేందుకు కొందరు అడ్వాన్స్ బుకింగ్ సైతం చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి ఓ మత్స్యకారుడికి రూ.10వేలు అడ్వాన్స్ చెల్లించి మరీ పులసను ప్రీ బుకింగ్ చేసుకున్నాడట. అంటే పులస వలకు చిక్కితే తనకే ఇవ్వాలనే ముందస్తు ఒప్పందం. వలకు చిక్కిన చేపలకు డబ్బులివ్వడం, వేలంలో కొనుక్కోవడం కామన్.. కానీ నీటిలో ఉందో లేదో.. వలకు చిక్కుతుందో లేదో.. అవమీ తెలియకుండా అడ్వాన్స్ బుకింగ్ దక్కించుకున్న ఘనత మన గోదారి పులదేనని స్థానికులు తెగ చెప్పేసుకుంటున్నారు.