నగరంలో ఊపందుకున్న రాఖీ విక్రయాలు
తెలంగాణ ప్రాంతంలో రాఖీ విక్రయాలు ఊపందుకున్నాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగతో ఎక్కడ చూసినా షాపులన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. వివిధ రంగులతో షాపులన్ని కళకళలాడుతూ ఉన్నాయి. శనివారం రాఖీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఇలా తెలంగాణలో ఏ కేంద్రంలో చూసిన కొనుగోలు దారులతో కిక్కిరిసిపోతోంది. నగరంలో అనేక ప్రాంతాల్లో రాఖీ దుకాణాలు వెలిశాయి. వివిధ డిజైన్లలో రూ.10 నుంచి రూ.1200 ధర కలిగిన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. సాంప్రదాయ దూది రాఖీ, భగవద్గీత రాఖీ, పాస్పోర్ట్ రాఖీ, హ్యాండ్ బ్యాగ్ రాఖీలతో పాటు లాకెట్, రుద్రాక్ష, ముత్యాలు, రంగుల, జరీ రాఖీలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. చిన్నారులు మెచ్చేలా కార్టూన్ పాత్రలతో కూడిన రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాగా పలువురు వెండి రాఖీల కోసం స్వర్ణకారులకు ఆర్డర్లు ఇచ్చారు. అటు రాఖీలకే కాకుండా స్వీట్ హౌస్ వాళ్లకి కూడా భలే గిరాకీ అవుతోంది.