మింగేసింది అంతా..కక్కించిన హైడ్రా..
- *ఆక్రమణలను తొలగించిన హైడ్రా
*దాదాపు 12.50 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
*దాదాపు రూ. 1100 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
By. V. Krishna kumar
Tpn: bureau
నగరంలో పలు చోట్ల ఆక్రమణలను
హైడ్రా తొలగించింది. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో కబ్జాల నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించింది. 12.50 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ. 1100ల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో మొత్తం 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలనుతొలగించింది. ఇక్కడ ఈ భూమి విలువ రూ. 750 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 7.50 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోగా..రంగారెడ్డిజిల్లాలో ప్రజావసరాలకు ఉద్దేశించిన 680 గజాల స్థలాన్ని హైడ్రా శుక్రవారం కాపాడింది.
** తప్పుడు సర్వే నంబరుతో..*
షేక్పేట మండలం, బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లోని సర్వే నంబరు 403లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాల చెర నుంచి హైడ్రా విడిపించింది. దీని విలువ రూ. 750 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. లేని సర్వే నంబరు(403/52 )తో.. అన్ రిజిస్టర్డ్ సేల్డీడ్ను సృష్టించి ఈ భూమి తనదంటూ పార్థసారధి అనే వ్యక్తి కబ్జాకు పాల్పడినట్టు రెవెన్యూ అదికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తాగు నీటి వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఇందులో 1.20 ఎకరాల భూమిని జలమండలికి ప్రభుత్వం ఇచ్చినా అక్కడ పనులు చేయకుండా అడ్డుకుంటున్నారనేది మరో ఫిర్యాదు. ఈ రెండు ఫిర్యాదులను హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని ఆక్రమణలను శుక్రవారం తొలగించింది.
** వేట కుక్కలతో కాపలా..*
చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలతో కాపాలా పెట్టి అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో పార్థసారథిపై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. కోర్టులో వివాదం ఉండగా.. మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డు లు వేసి.. ప్రభుత్వ భూమినే అడ్డా వేసుకొని మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఫేక్ సర్వే నంబర్ (403/52) తో ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని రెవెన్యూ అధికారులు కేసులు పెట్టారు. షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను హైడ్రా తొలగించింది. పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న షెడ్డులను నేలమట్టం చేసింది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను హైడ్రా ఏర్పాటు చేసింది.
** మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోనూ..*
కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం మహాదేవపురం లో పార్కులు, ప్రజావసరాల కు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా క్షేత్రస్థాయిలో విచారించి శుక్రవారంచర్యలుతీసుకుంది. 3.50 ఎకరాల మేర పార్కు స్థలంలో ఆక్రమణలను తొలగించింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ విలేజ్ ఏజీ ఆఫీసు ఉద్యోగులకు చెందిన హౌసింగ్ సొసైటీ లే ఔట్లో కూడా పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన 3 ఎకరాల ల్యాండ్ కబ్జాకు గురి కాగా హైడ్రా శుక్రవారం ఆక్రమణలను తొలగించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తట్టి అన్నారం విలేజ్ శ్రీలక్ష్మి గణపతి కాలనీలో కూడా 680 గజాల మేర విస్తరించిన పార్కు ఆక్రమణలను కూడా హైడ్రా తొలగించింది. ఇందులో 270 గజాల ప్లాట్ తనకుందంటూ పార్కు స్థలంలోనే పాగా వేసేందుకు ప్రయత్నించగా స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. క్షేత్రస్థాయిలో విచారించిన దరిమిలా పార్కు స్థలాన్ని మొత్తం కాపాడి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.

.jpeg)