కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు..
- - శాటిలైట్ హ్యాక్ చేసి.. సినిమాలు పైరసీ చేశారు..
- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పైరసీ
- ఒరిజినల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవు
- తెలుగు సినీ పరిశ్రమకు రూ. 3700 కోట్ల నష్టం
- పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
- ప్రభుత్వ డేటాను కూడా హ్యాక్ చేసిన ముఠా
- ఎన్నికల కమిషన్ వెబ్సైట్ సైతం హ్యాక్
By. V. Krishna kumar
Tpn: bureau
దోపిడీ అంటే మన అందరికీ తెలుసు.. ముఠా రావడం ఎటాక్ చేయడం.. అందినంత దోచుకు పోవడం.. బట్ డిజిటల్ దోపిడీ అంటే మాత్రం చాలా మందికి తెలియదు.. అదే పైరసీ..
సినిమా పైరసీ అంటే ఇప్పటివరకు మనకున్న ఆలోచన వేరు. థియేటర్లకు వెళ్లి కెమెరాతో సినిమాను రికార్డు చేసి పైరసీ చేస్తుంటారని అనుకుంటాం. అయితే అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏకంగా డిజిటల్ శాటిలైట్లనే హ్యాక్ చేసి సినిమాలను పైరసీ చేస్తున్నట్లు తేలింది. అలా పైరసీ చేసిన సినిమాలు ఒరిజినల్ కాపీతో సమానంగా హైడెఫినిషన్ కంటెంట్ తో బయటకు వస్తున్నాయి. దీనివల్ల సినిమా టికెట్ కొనుక్కొని వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోతుంది. అటువంటి హైటెక్ పైరసీ ముఠాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సైబర్ క్రైమ్ టీమ్ తో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గుట్టు రట్టు చేశారు. ఈ డిజిటల్ దోపిడీ కారణంగా ఒక్క తెలుగు సినీ పరిశ్రమకే రూ. 22 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీవీ ఆనంద్ ప్రకటించారు.
నెదర్లాండ్స్ ఐపీ అడ్రస్లను ఉపయోగించి...
పాట్నాకు చెందిన అశ్వనీ కుమార్ ఈ హ్యాకింగ్లో నిపుణుడు. మరొక కీలక నిందితుడు డిజిటల్ మీడియా సర్వర్లలోకి సులువుగా ప్రవేశించగలిగే నైపుణ్యం కలిగి ఉన్నాడు. అంతకుముందు ఎన్నికల కమిషన్ వెబ్సైట్తో సహా పలు ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేసి ఉద్యోగుల వివరాలు, జీతాల సమాచారాన్ని దొంగిలించిన ఘనత ఇతడిది. బిహార్లోని అతని ఇంటికి వెళ్లిన పోలీసు బృందానికి అక్కడ 22 సీసీటీవీ కెమెరాలతో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థ కనిపించి ఆశ్చర్యపరిచింది. పైరసీ కాపీలను అప్లోడ్ చేయడానికి వీరు నెదర్లాండ్స్ ఐపీ అడ్రస్లను ఉపయోగించేవారు. పైరసీ చేసిన కాపీలను తక్షణమే టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా మరో వ్యక్తికి పంపి, ఆ తర్వాత టొరెంట్ సైట్లలో అప్లోడ్ చేసేవారు.
క్రిప్టో కరెన్సీల్లో కోట్ల ఆదాయం...
పైరసీ సైట్లలో చూపించే బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రకటనల ద్వారా ఈ ముఠా భారీ ఎత్తున డబ్బు సంపాదించింది. చెల్లింపులన్నీ పట్టుకోలేని విధంగా క్రిప్టో కరెన్సీల ద్వారా జరిగేవి. కిరణ్కు మొత్తంగా లక్ష డాలర్ల వరకు ఆదాయం వచ్చింది. యూజర్లు పైరసీ లింక్ను క్లిక్ చేయగానే వారి వ్యక్తిగత వివరాలు ఈ ముఠాకు చేరేవి. ఒక సర్వర్ ప్రొటెక్షన్ మార్గాన్ని మూసివేస్తే మరో మార్గంలో ప్రవేశించి పైరసీకి పాల్పడేవారు. ఈ పైరసీ ముఠాకు నెదర్లాండ్స్, దుబాయ్లోని ముఠాలతో లింకులు ఉన్నాయని ఆనంద్ తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుపై నిందితులపై నిఘా పెట్టి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 5మూవీ రూల్జ్, 1 తమిళ్ బ్లాస్టర్, 1 తమిళ్ ఎంవి లాంటి ఫైరసీ వెబ్ సైట్ల వల్ల వ్యక్తి గత డేటా హ్యాకర్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని ఆనంద్ తెలిపారు.