ఇక అదిరిపోనున్న హైదరాబాద్..
- సిటీలో ట్రాఫిక్ చెక్ కి నివేదికలు సిద్ధం చేసిన సర్కార్..
టూరిజం అభివృద్ధి దిశగా అడుగులు..
గోల్కొండ, ట్యాంక్ బండ్ ఇలా ఎక్కడపడితే అక్కడ రోప్ వేలు..
రద్దీ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు..
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
హైదరాబాద్ .. ప్రపంచంలోని మహా నగరాల్లో 41వ స్థానంలో ఉంది. మెట్రో పాలిటన్ సిటీగా పేరుపొందింది.. కానీ ఇక్కడ జనాభా, ట్రాఫిక్ విషయానికి వస్తే అందరూ అదిరిపోయి, బెదిరిపోవాల్సిందే.. చిన్న వర్షం పడితే చాలు కిలోమీటర్లు నిలిచిపోయే వాహనాలు.. దాన్ని క్లియర్ చేయలేక అధికారులకు, సిబ్బందికి ముప్పతిప్పలు. అందుకే హైదరాబాద్ అంటే చాలా మంది చూడటానికి వచ్చిన బయట తిరాగాలంటే భయపడతారు. ఆ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేయాలని తెలంగాణ సర్కార్ ఆలోచన చేసింది. టూరిస్ట్ ప్లేస్ గా వుండే సిటీని మరింత తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం ఓ సరికొత్త కార్యక్రమానికి సై అంది.
హైదరాబాద్ లో జనాభా నిత్యం పెరిగిపోతోంది. 2025 లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటీ 13 లక్షల 30 వేలుగా ఉండగా.. గతేడాదితో 2024 తో పోలిస్తే 2.43 శాతం పెరుగుదల కనిపించింది. ఇలా ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరిగిపోతోంది. అటు జనాభాతో పాటు వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వాహనాల సంఖ్య 85 లక్షల 22 వేల 286 కు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. ట్రాఫిక్ కారణంగా నిత్యం ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లేవాళ్లు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తూనే టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా టూరిజం అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మొదట నగరంలోని టూరిస్టు ప్రాంతాల్లో రోప్ వేలను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. అలా ముందు గోల్కొండ నుంచి కుతుబ్షాహి టూంబ్స్ వరకు.. తర్వాత ట్యాంక్ బండ్, మీరాలం ట్యాంక్ వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని టూరిజం డెవలప్మెంట్ అధికారులు భావిస్తున్నారు. దీంతో నగరంలోని టూరిస్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టొచ్చని తేల్చారు. ఇక గాల్లోనే ప్రయాణించే ఈ రోప్ వేలో ఓ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో ఒకే సారి నలుగురు లేదా ఆరుగులు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు దోహడపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఓవైపు ట్రాఫిక్ సమస్యలను నియంత్రిస్తూనే.. మరోవైపు టూరిస్టులను, విదేశీయులను ఆకర్శించవచ్చని భావిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాలను అధ్యాయనం చేసి ఎక్కడ వీలైతే అక్కడ ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఫ్లై ఓవర్లు నిర్మించాలని భావిస్తున్నట్లు, ఇందు కోసం ఓ నివేదిక అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ఇక సిటీలో గోల్కొండ, ట్యాంక్ బండ్, చార్మినార్ ఇలా ఎక్కడికి పిల్లలు, బంధువులతో వెళ్లిన ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు.