సేఫ్ ల్యాండింగ్..అంతరిక్షం నుంచి భూమికి చేరుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడు శుభాన్షు శుక్లా
రోదసిలో 20 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమికి తిరిగివచ్చారు. శుభాన్షు శుక్లా తన ఇతర సహచరులతో కలిసి జూలై 15 మంగళవారం అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ డియాగో తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూమిపై దిగారు. స్పేస్ఎక్స్ కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో భారత్ కు చెందిన శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్ కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఆక్సియోమ్ మిషన్ 4ను విజయవంతంగా పూర్తి చేసి భూమికి తిరిగి వచ్చారు. 20 రోజుల అంతరిక్ష యాత్ర అనంతరం నలుగురు వ్యోమగాములు భూవాతావరణంలోకి ప్రవేశించి జూలై 15న పసిఫిక్ మహాసముద్రంలో దిగారు.
ఈ యాత్రలో 230 సూర్యోదయాలను శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం చూసింది. అలాగే సుమారు కోటి కిలోమీటర్ల మేర ప్రయాణించింది. భూమికి 250 మైళ్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఈ బృందం వివిధ రకాల ప్రయోగాలు.. బయో మెడికల్ సైన్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, న్యూరోసైన్స్, వ్యవసాయం, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించింది. రెండు వారాల పాటు భూమి చుట్టు దాదాపు 230 సార్లు ప్రదక్షిణలు ఈ బృందం చేసింది. ఈ లెక్కన 96.5 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించింది.
డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లోని శుభాంశు శుక్లా, అతని తోటి సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రావడానికి 22 గంటలకు పైగా సమయం పట్టింది. శుభాంశు శుక్లా, ఇతరులు స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ భూమి వైపు దిగడానికి ముందు దాని డీ-ఆర్బిట్ బర్న్ ను నిర్వహించారు. వారి స్ప్లాష్ డౌన్ కు ముందు డ్రోగ్, ప్రధాన పారాచూట్ లను మోహరించారు. డ్రాగన్ వ్యోమనౌక నెమ్మదిగా పారాచూట్ ద్వారా పసిఫిక్ మహాసముద్రంలో దిగింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:02 గంటలకు క్యాప్సూల్ కింద పడింది. 'గొప్ప రైడ్ చేసినందుకు ధన్యవాదాలు. ... తిరిగి రావడం సంతోషంగా ఉంది' అని ఆక్సియోమ్ ఉద్యోగి, నాసా మాజీ వ్యోమగామి కమాండర్ పెగ్గీ విట్సన్ అన్నారు.
జూన్ 25న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి వారు అంతరిక్షంలోకి వెళ్లారు. అక్కడ 20 రోజుల పాటు 60 శాస్త్రీయ ప్రయోగాలు చేశారు. శుభాన్షు శుక్లా భూమిపై దిగిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ‘‘భారత వ్యోమగామి తన అంకితభావం, ధైర్యం మరియు మార్గదర్శక స్ఫూర్తితో బిలియన్ కలలకు స్ఫూర్తినిచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల బస తర్వాత వ్యోమగామి భూమికి తిరిగి వచ్చారు’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.