విజయవాడలో లూలూ మాల్..! ప్రయత్నం సాఫీగా సాగేనా?

By Dev
On
విజయవాడలో లూలూ మాల్..!   ప్రయత్నం సాఫీగా సాగేనా?

విజయవాడ నగరానికి లులు మాల్‌ రానుంది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ (మెయిన్‌ బస్టాండ్‌)కు సమీపంలోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ జంక్షన్‌ వద్ద ఉన్న గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో స్థలాన్ని ప్రభుత్వం ఇందుకు కేటాయించనున్నట్లు తెలిసింది.  లులు ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ విశాఖపట్నం, విజయవాడల్లో మాల్స్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ రెండు చోట్లా కలిపి రూ.1,222 కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించింది.దీంతో విజయవాడలో ఆ సంస్థ మాల్‌ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపుపై ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) పరిశీలన చేసింది.చివరకు గవర్నర్‌పేట-2 డిపో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

rtc

 ఇందులో భాగంగా డిపో స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్‌ కిశోర్‌ నుంచి ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావుకు ఇటీవల లేఖ వచ్చింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆర్టీసీ యాజమాన్యం పరిశీలిస్తోంది. ఆ స్థలాన్ని లులు మాల్‌కు ఇవ్వాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి కూడా ఆర్టీసీ ఎండీకి సూచన వచ్చినట్లు సమాచారం.

గవర్నర్‌పేట-2 డిపో సుమారు 5 ఎకరాల్లో ఉంది. ఇక్కడ గవర్నర్‌పేట-2తో పాటు, ఒకటో డిపోకి చెందిన బస్సులను ఉంచుతారు. 1, 2 డిపోల మేనేజర్ల కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడీ భూమి లులు మాల్‌ కోసం ఇస్తే, ప్రత్యామ్నాయంగా గొల్లపూడి సమీపంలో ఆర్టీసీకి 5 ఎకరాలు కేటాయించేలా ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఆ భూమికి సంబంధించిన వివరాలను ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేసింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం తాజా సమావేశంలో లులు ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.దీంతో త్వరలోనే గవర్నర్‌పేట-2 స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థలంలోని కొంత భాగంలో గతంలో నగరపాలక సంస్థ ఐరన్‌ స్క్రాప్‌ మెటీరియల్‌తో రూపొందించిన బొమ్మలతో పార్క్‌ ఏర్పాటు చేసింది. దీనిని కూడా మాల్‌కు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

లూలూ మాల్ అక్కడొద్దంటున్న సీపీఎం పార్టీ నేతలు

లాలూ మాల్‌కు విజయవాడ ఆర్టీసీ పాత బస్టాండ్‌ స్థలాన్ని అప్పగించే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. సాధారణ ప్రజలకు రవాణా సదుపాయం కలిగించే ఆర్టీసీ సంస్థకు ఆర్థిక సహాయం చేసి, అన్ని విధాలా బలోపేతం చేయవలసిన అవసరం ఉందని, కానీ కూటమి ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను నాశనం చేసేందుకు విలువైన స్థలాలను బడా కంపెనీలకు కట్టబెట్టడం తగదంటూ వ్యతిరేకిస్తున్నారు.వందల మందికి ఉపాధి అవకాశాలిచ్చే లూలూ వస్తే అందరూ ఆహ్వానిస్తారు. అయితే   అంతటి హాట్ స్పాట్ లో లూలూ మాల్ ఏర్పాటు  చేస్తే వచ్చే ట్రాఫిక్ సమస్యలు, నగర పౌరుల ఇబ్బందులను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందనేదే కీలకం. 

Advertisement

Latest News