తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..సామాన్య ప్రజలకు ఇక్కట్లు!
ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఏపీలోని విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదీ పరివాహక ప్రాంతాలలో ఈతకు, చేపల వేటకు వెళ్లవద్దని..వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు, చెట్ల కింద ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది.
మరోవైపు ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. ఎగువనున్న రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయం 6గం.లకు ప్రకాశం బ్యారేజ్ గేట్లెత్తి 3వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు కృష్ణానదికి చెందిన సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రకటించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నదిలో ఈతకు వచ్చేవారు, గేదెలు, గొర్రెల కాపర్లు, ఇతర పౌరులు ఆటవిడుపుకోసం వచ్చి అపాయం కొనితెచ్చుకోవద్దని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకావం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ... గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఉపరితగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడం, బోనాలు జరుగుతుండడంతో వాహనదారులు, నగరపౌరులు ఇబ్బందులు పడుతున్నారు.