కీకారణ్యంలో..ప్రమాదకర గుహలో..భక్తి ఎక్కువై ఓ విదేశీ మహిళ..ఏం చేసిందంటే..?
అసలే కీకరాణ్యం..పైగా ప్రమాదకరమైన గుహ..అది చాలదన్నట్లు తనతో పాటు ఇద్దరు ఐదేళ్ల వయసు కూడా నిండని కుమార్తెలు..భక్తి ఎక్కువై ఓ మహిళ చేసిన రహస్య జీవనం సినిమా సాహసాలను మించిపోయింది.
పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమిగా, ఆధ్యాత్మిక దిక్సూచిగా భారతదేశం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తూనే ఉంది. ఆధ్యాత్మికత కోసం ఎందరో విదేశీయులు ఇక్కడకు రావడం, కొందరు ఇక్కడి ఆధ్యాత్మికతతో తమ జీవితాన్ని మలుచుకోవడం, మారడం జరుగుతూనే ఉంది. తాజాగా ఇక్కడ ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఆకర్షితురాలైన ఓ రష్యన్ మహిళ ఒకరు ఉత్తర కన్నడ జిల్లా కుంట తాలూకా రామతీర్ధ కొండల్లోని మారుమూల గుహలో జీవనం సాగిస్తోంది. ఆమెతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. దట్టమైన అడవులు, లోతైన మలుపులతో కూడిన ఈ సహజ గుహలో రెండు వారాలుగా ఆమె జీవనం సాగిస్తోంది. అక్కడే రుద్ర విగ్రహాన్ని పెట్టుకుని అనునిత్యం ధ్యానం సాగిస్తూ వచ్చింది.
గుహ ప్రాంతం సమీపంలో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో పోలీస్ పెట్రోలింగ్ టీమ్ రామతీర్ధ పర్వత ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక గుహ బయట ఎవరివో దుస్తులు కనిపించాయి. దీంతో వారు పైకి వెళ్లి చూడగా గుహలో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. రష్యాకు చెందిన ఆ మహిళను 40 ఏళ్ల నైనా కుటినా అలియాస్ మోహిగా గుర్తించారు. ఆమెతో పాటు ఆరేళ్ల కుమార్తె ప్రేయ, నాలుగేళ్ల అమా ఉన్నారు. రెండు వారాలుగా ఇక్కడి క్లిష్ట వాతావరణంలో ఎలా జీవనం సాగించారు, ఏమి తిన్నారో తెలియక పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2024 జూలైలో గుహ ఉన్న రామతీర్థ కొండ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద కొండచరియలు విరిగిపపడ్డాయి. విష పూరిత పాములు సహా ప్రమాదకరమైన వన్య ప్రాణులకు నిలయమైన ఆ ప్రాంతం. చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా పోలీసులు తెలిపారు.
గుహలో రుద్రదేవుడి విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేసుకుంటూ, అడవిలో దొరికిన కందమూలాలు, పండ్లు తిని జీవిస్తున్నట్లు రష్యన్ మహిళ తెలిపారు.స్థానిక రైతు సంఘాలు, ఆదివాసీల సహకారంతో తల్లీ, కుమార్తెల ఆచూకీ తెలుసుకున్నారు. వారితో మాట్లాడి ఒప్పించి బయటకు తీసుకొచ్చారు. వారిని రాయబార కార్యాలయం ద్వారా రష్యా పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నారాయణ్ తెలిపారు. మోహి నిగూఢ జీవనానికి గల కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు. ఆమె బిజినెస్ వీసాపై 2015లోనే భారత్కు వచ్చారని, వీసా గడువు 2017లోనే ముగిసిపోయిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఎక్కువ రోజులు గోవాలోనే గడిపిన ఆమె స్థానిక భాషలపై పట్టు సంపాదించారు. కొన్ని రోజుల కిందటే గోకర్ణకు చేరుకున్నట్లు భావిస్తున్నారు. అయితే.. మోహి భర్త ఎవరు, ఎక్కడున్నారు, ఎందుకు రహస్య జీవనం గడుపుతున్నారో తెలుసుకునేందుకు ఆమెను శనివారం రాత్రి బెంగళూరుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.