కంచ గచ్చిబౌలి కేసు జులై 23వ తేదీకి వాయిదా
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ జులై 23వ తేదీకి వాయిదా పడింది. ఈ భూముల్లో అడవులను పునరుద్దరించాలని మరో మారు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సిఎస్ తో సహా అరడజను అధికారులు అక్కడే ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళ్తారని సిజెఐ బిఆర్ గవాయ్ హెచ్చరించారు.
జులై 23 వ తేదీ లోపు గతంలో ఉన్నట్లుగా అక్కడ పర్యావరణాన్ని పునరుద్దరించాలన్న సుప్రీం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ జులై 23 వతేదీకి వాయిదా వేసింది. విద్యార్ధులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ దాఖలైన ఐఏను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.ఆ విషయంలో ప్రత్యేకంగా మరో పిటీషన్ ను దాఖలు చేయాలని, ఈ కేసులో కలపకూడదని తెలిపింది.
గత విచారణ సందర్భంగా పర్యావరణ వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్తూ నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశిస్తూ అప్పటి వరకు యధాస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా ఒక్క చెట్టు కూడా నరకడానికి ఒప్పుకోమన్న సుప్రీంకోర్టు, గత విచారణ సందర్భంగా వందల ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండని ప్రశ్నించింది. గత విచారణ సందర్భంగా కంచ గచ్చిబౌలి భూముల గురించి సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక సీఈసీ అందజేసింది.