ప్రాణాలు నిలబెట్టే ఆసుపత్రి..10 నిమిషాల్లో రెడీ!
ప్రతి విపత్తు ఓ వినూత్న ఆవిష్కరణకు విత్తు. వరదలు, రోడ్డు, అగ్ని ప్రమాదల వంటి అత్యవసర వేళల్లో వైద్యమందించడం చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్న పని. కానీ ఇపుడు పరిస్థితి మారింది. టెక్నాలజీ వచ్చింది. వేగంగా వైద్యమందించడమే కాకుండా 10 నిమిషాల్లో మొబైల్ పోర్టబుల్ హాస్పిటల్ రెడీ అయ్యే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అవును..అత్యవసర పరిస్థితులలో అన్ని వైద్య సేవలందించే ఆ ప్రాజెక్టే 'భీష్మ'. ఇదో పోర్టబుల్ సంచార ఆసుపత్రి. ఆరోగ్య మైత్రి క్యూబ్ పేరిట.. భారత్ హెల్త్ ఇనీషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి(భీష్మ)ని రక్షణ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు తీర్చిదిద్దాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)కు మూడు ‘భీష్మ’ యూనిట్లను కేంద్రం కేటాయించింది.
ఏమిటది? ఏం చేస్తుంది?
భీష్మ అనే ఈ యూనిట్ 72 మినీ క్యూబ్లతో కూడిన చిన్న ఆసుపత్రి. టన్ను బరువు ఉండే దీనిని రోడ్డుమార్గంలో ఒకచోట నుంచి మరోచోటుకి సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. డ్రోన్లు, పారాచూట్తోపాటు హెలికాప్టర్లోనూ తరలించవచ్చు. 10 నిమిషాల్లో ఆసుపత్రిగా మార్చేయవచ్చు.
భీష్మ లెవెల్-3 ట్రామా సెంటర్గా సేవలందిస్తుంది. గోల్డెన్ అవర్(రోడ్డు ప్రమాదంలో ఆపదలో ఉన్నప్పుడు చేసే చికిత్స)లో వ్యక్తి ప్రాణాలను కాపాడే అడ్వాన్స్డ్ ట్రామా లైఫ్ సపోర్ట్, విపత్తుల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు టాక్టికల్ కాంబాట్ క్యాజువాల్టీ కేర్ కూడా ఇందులో ఉన్నాయి.
టెక్నాలజీమయం..
భీష్మ... సౌర విద్యుత్తుతో నడుస్తుంది. వెంటిలేటర్లు, జనరేటర్లు, పరీక్షల కిట్లు, డాక్యుమెంటేషన్ టూల్స్తోపాటు పోర్టబుల్ ఎక్స్రే, అల్ట్రా సౌండ్, ఏఈడీ, యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్లు, మినీ ల్యాబ్, సర్జికల్ కిట్లు, ఈసీజీ/బీపీ/ఎస్పీవో2 సిస్టం ఉన్నాయి. పది నిమిషాల్లో 30కిపైగా పరీక్షల ఫలితాలను అందించే సామర్థ్యం దీని సొంతం. ఒక్కో యూనిట్లో 200 మంది దాకా క్షతగాత్రులకు చికిత్సలు, 20 అత్యవసర సర్జరీలు కూడా చేయొచ్చు.
భీష్మ యూనిట్లను ఎయిమ్స్లో ఇటీవల ప్రదర్శించారు. విశ్రాంత ఎయిర్ మార్షల్ డాక్టర్ తన్మయ్ రాయ్... యూనిట్ను ఆసుపత్రిగా ఎలా మార్చవచ్చో వివరించారు. ఇలాంటివి కాస్త ఖర్చయినా ఎక్కువ ఏర్పాటు చేయడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపితే ఎన్నో ప్రాణాలను కాపాడడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనడంలో సందేహం లేదు.