వ్యాపారం చిన్నదే.. ఆదాయమే కోట్లలో..
- నకిలీ మద్యం లేబుల్స్ తయారీ యూనిట్ పై దాడి..
- గుట్టుగా సాగుతున్న వ్యాపారం రట్టు చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్..
- సూర్యాపేటలో తీగ లాగితే.. శివార్లలో కదిలిన డొంక..
మీరు తాగుతున్నది అసలు మద్యమా లేక నకిలీనా అంటే గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే నకిలీ మద్యం అసలు కన్నా పదింతలు పక్కాగా తయారు అవుతోంది. అందుకే గుర్తించడం చాలా కష్టం.. అచ్చం అలాగే ఓ ముఠా భారీ స్కెచ్ వేసి కోట్ల రూపాయల నకిలీ మద్యం తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తోంది. ఈ విషయం పసిగట్టిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే వాటికి గవర్నమెంట్ లేబుల్ మక్కీగా ఎలా తయారు చేస్తున్నారు అని ఆరా తీస్తే ఇంకేముంది మన శివారు ప్రాంతంలోనే పెద్ద యూనిట్ బయటపడింది. ఇక అసలు విషయానికి వస్తే.
సూర్యపేట్లోని ఒక రైస్ మిల్లులో నకిలీ మద్యం తయారీ, సీసాలను, నకిలీ మద్యాన్ని, స్పీరిట్ను, లేబుల్స్, మద్యం సీసాల మీదే వేసే వివిధ కంపెనీలకు చెందిన లేబుల్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం టీమ్ లీడర్ నంద్యాల అంజిరెడ్డి బృందాన్ని ఆదేశించారు. చరణ్జిత్ సింగ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన రూ. 4 కోట్ల విలువ స్పీరిట్ సమాచారాన్ని సేకరించారు. కొనుగోలు చేసిన స్పిరిట్ ను ఎక్కడెక్కడికి సరఫరా చేశారు, ఏయే రాష్ట్రాలకు తరలించారనే విషయాన్ని సేకరించారు. ఎవ్వరెవ్వరి వద్ద నుంచి ఎలాంటి బ్యాంకు లావా దేవీలు జరిగాయనే విషయం ఆరా తీస్తుండగా నకలీ మద్యం తయారీ బాటిళ్లపై వేసే గర్నమెంట్ లెబుల్స్ను తయారు చేసే ప్రింటింగ్ యూనిట్ను కుషాయిగూడ లో ప్రాంతంలో గుర్తించారు. వెంటనే టీమ్ మొత్తం దాడి చేసి రూ. 50లక్షల విలువ గల నకిలీ మద్యం లేబల్స్ తయారీ ప్రింటింగ్ యంత్రాలు, రూ.30 లక్షల విలువ చేసే కలర్ లేబుల్స్ తయారీ ప్రింటర్తోపాటు, రూ. 20 లక్షల విలువ చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కుషాయిగూడకు చెందిన గడ్డమీది ప్రకాష్, నివావత్ రాజేష్లను అరెస్టు చేశారు. మద్యం కొన్నాం.. తాగేశం అనేలా కాకుండా దానిపై అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. లేదంటే నకిలీ మద్యం బారిన పడి ప్రాణాలు పోయే అవకాశాలు అనేకం అన్నారు.