విడదల రజనీ అరెస్ట్కు రంగం సిద్ధం..!

- ఏసీబీ అదుపులో విడదల రజనీ మరిది గోపీ
- ఏసీబీకి అన్ని వివరాలు వెల్లడించిన గోపీ..?
- రజనీ ఆదేశాలతోనే వసూళ్లకు పాల్పడినట్లు క్లారిటీ
- యడ్లపాడు స్టోన్ క్రషర్ యజమానికి బెదిరింపులు
- రూ.2.20 కోట్లు వసూలు చేసినట్లు ఒప్పుకున్న గోపీ..?
- ఈ వసూళ్లలో కీలక సూత్రధారిగా అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా
- జాషువాను కూడా నిందితుల జాబితాలో చేర్చిన ఏసీబీ
- జాషువా అప్రూవర్గా మారితే రజనీకి ఉచ్చు బిగిసినట్లే..?
వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ మంత్రి విడదల రజిని దందాలు, దౌర్జన్యాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. యడ్లపాడు మండలానికి చెందిన స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించారని ఆమెపై కేసు నమోదైంది. ఇదే కేసులో బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలపై రజనీ మరిది గోపీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పుడు ఆయన నోరు విప్పారని.. రజినీ ఆదేశాల మేరకే స్టోన్ క్రషర్ యజమానులకు ఫోన్ చేసి బెదరించినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు విడదల రజిని వంతు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.
2020లో యడ్లపాడులోని శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఫిర్యాదుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా రజిని, ఏ2గా ఆమె మరిది గోపీనాథ్, ఏ4గా రజినీ పీఏ దొడ్డ రామకృష్ణ ఉన్నారు. అప్పటి విజిలెన్స్ అధికారి జూషువాను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఏ2గా ఉన్న గోపీని అరెస్ట్ చేసి ఆయన నుంచి అన్ని ఆధారాలు సేకరించారనే టాక్ వినిపిస్తోంది. దీంతో త్వరలోనే ఏ1గా ఉన్న మాజీ మంత్రి రజనీని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం మొదలైంది. రజినీ గతంలో మంత్రిగా పనిచేయడంతోపాటు ప్రస్తుతం వైసీపీ కీలక నేతగా వ్యవహరిస్తుండడంతో.. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2019లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రజనీ.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దూకుడు పెంచారు. దీంతో మంత్రివర్గ విస్తరణలో జగన్ రజినీకి ఛాన్స్ ఇచ్చి, కీలకమైన పోర్టుపోలియోను కేటాయించారు. అప్పుడే ఆమె తన టీమ్తో యడ్లపాడు స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారాక దానికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా రజనీతోపాటు అప్పట్లో విజిలెన్స్ అధికారిగా పనిచనేసిన ఐపీఎస్ జాషువాను కూడా నిందితుడిగా చేర్చారు. ఇప్పుడాయన అప్రూవర్గా మారతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన అప్రూవర్గా మారితే విడదల రజినీకి ఉచ్చు మరింత బిగుస్తుంది. ఇకపోతే.. క్రషర్ యజమానులను బెదరించి డబ్బు వసూలు చేయడంలో జాషువానే కీలకపాత్ర పోషించారన్న అభియోగాలున్నాయి. ఈ అక్రమ వసూళ్లతో రజనీ తన వాటాగా రెండు కోట్లు తీసుకున్నారని కేసు నమోదు చేశారు. రజనీ మరిది గోపీనాథ్కు, జాషువాకు చెరో పది లక్షలు అందినట్లు పేర్కొన్నారు. తాజాగా గోపీ అరెస్టు, జాషువా అప్రూవర్గా మారతారన్న ప్రచారంతో విడదల రజినీ జైలుకు వెళ్లడం ఖాయం అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Latest News
