డ్రైవర్ హత్య కేసులో వినూత దంపతులు - జనసేన నుంచి బహిష్కరణ.!
* డ్రైవర్ మర్డర్ కేసులో వినూత దంపతులు
* చైన్నై సమీపంలోని నదిలో రాయుడి మృతదేహం
* సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు
* వినూత దంపతులతోపాటు మరో ముగ్గురి అరెస్ట్
శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ చార్జ్ కోటా వినూత డ్రైవర్ హత్య కేసు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో వినూత దంపతుల పాత్ర ఉందన్న ఆరోపణలతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జనసేన ప్రకటించింది. ఇందుకు సంబంధించిన లేఖను జనసేన అధిష్టానం విడుదల చేసింది. గత కొంతకాలంగా ఆమెను పార్టీకి దూరంగా ఉంచినట్టు వెల్లడించింది. చెన్నైలో జరిగిన ఓ హత్య కేసులో ఆమెపై ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయని.. ఈ క్రమంలో వినూత కోటను పార్టీ నుంచి బహిష్కరించినట్టు జనసేన ప్రకటించింది.
వినూత దగ్గర పీఏ, డ్రైవర్ గా రాయుడు
వినూత, చంద్రబాబు దంపతుల వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గం బొక్కలసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ రాయుడు గత 15ఏళ్లుగా డ్రైవర్గా, పీఏగా పనిచేస్తున్నాడు. అయితే జూన్ 21న డ్రైవర్ రాయుడు చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఇటు పేపర్లో, సోషల్ మీడియాలో వినూత పోస్టు చేశారు. ఇక మీదట రాయుడ శ్రీనివాసులుకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.
వినూత సహా ఐదుగురు అరెస్ట్
డ్రైవర్ రాయుడు హత్య కేసులో జనసేన పార్టీకి చెందిన కోట వినూత దంపతులతోపాటు మరో ముగ్గురు.. మొత్తం ఐదుగురి పాత్ర ఉందని గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్టు చైన్నై పోలీసులు ప్రకటించారు. ముందుగా ఈనెల 8న డ్రైవర్ రాయుడి డెడ్ బాడీ చెన్నై సమీపంలోని కూవం నదిలో పోలీసులకు దొరికింది. యువకుడి చేతి మీద జనసేన గుర్తుతో పాటు వినూత పేరు ఉండడంతో చెన్నై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ వివరాలు వెల్లడించారు. సెవెన్ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువ వద్ద నాలుగు రోజుల క్రితం మృతదేహం కనిపించిందని.. ఈ నెల 8న చెన్నైలోని ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డ్ వెనుక ఉన్న కూవం నది కాలువలో రాయుడు మృతదేహాన్ని గుర్తించామన్నారు. నిందితులు కారులో శవాన్ని తీసుకువచ్చి అక్కడ పడేసినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని చెప్పారు. అక్కడ కనిపించిన కారు వివరాల ఆధారంగా నిందితుల వివరాలను గుర్తించామని తెలిపారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజులు రిమాండ్ విధించారు.
ప్రత్యర్థులకు సమాచారం ఇచ్చాడనే హత్య?
మరోవైపు డ్రైవర్ రాయుడు ఇటీవల కాలంలో ప్రత్యర్ధుల దగ్గర డబ్బు తీసుకుని సమాచారం వారికి ఇస్తున్నారన్న కారణంతో అతడిని విధుల నుంచి తొలగించామని వినూత దంపతులు చైన్నై పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. అయితే సీసీ ఫుటేజీ సహా పక్కా ఆధారాలు చూపించడంతో హత్య నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. వినూత దంపతులు పక్కాగా ప్లాన్ చేసి మరో ముగ్గురి సహాయంతో కాళహస్తిలోని గోడౌన్లో రాయుడిని టార్చర్ చేసి చంపారు. అనంతరం రాయుడి మృతదేహాన్ని వారి వాహనంలోనే చెన్నై దగ్గరకు తీసుకెళ్లి పడేసినట్టు పోలీసులు గుర్తించారు.