Hyderabad News: సైబరాబాద్ కమిషనరేట్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్
- నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో.. లా అండ్ ఆర్డర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్..
- పట్టుబడిన నిందితుల్లో నైజీరియన్..
- గోవా నుండి డ్రగ్స్ సరఫరా..
- రేవ్ పార్టీలకు, వీకెండ్ పబ్స్ కి సరఫరా చేసినట్లు వెల్లడి..
సైబరాబాద్ కమిషనరేట్ లో భారీ డ్రగ్ రాకెట్ ముఠా గుట్టురట్టైంది. నార్సింగి పిఎస్ పరిధిలోని అల్కాపురి కాలనీలో టీ న్యాబ్, నార్సింగి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 30 లక్షల విలువైన STCP పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒక నైజీరియన్ తో పాటు.. ఇద్దరు లోకల్ పెడ్లర్స్ ఉన్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. మణికొండ లో ఓ లగ్జరీ ఫ్లాట్ అడ్డాగా డ్రగ్స్ దందా కొనసాగుతోందని గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు తెలిపారు.
విస్డం ఒనేకా, మణికొండ కి చెందిన గోపిశెట్టి రాజేష్, వెస్ట్ గోదావరికి చెందిన బొమ్మ దేవర వీరరాజు ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పాస్ పోర్ట్ తో హైదరాబాద్ కు వచ్చిన నైజీరియన్ హైదరాబాద్ లో ఉంటూ మొయినాబాద్ పరిధి అజీజ్ నగర్ లోని ఫాం హౌజ్ లో మే 29న నిర్వహించిన రేవ్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేశారు. మే 31న మంగళగిరి లో ఫణి రాజ్ అనే వ్యక్తికి 15 గ్రాముల కొకైన్ సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడించారు. ఈ ముఠా నుంచి డ్రగ్స్ కొన్నవారిని గుర్తించిన పోలీసులు డ్రగ్స్ కన్జూమర్స్ అయిన ఫణి రాజ్, పవిత్ర రెడ్డి, సతీష్, సదా శివ, సుధీర్, భానులను సైతం అదుపులోకి తీసుకున్నారు.