ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ పై ఎఫెక్ట్..?
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పహల్గాంలో అమాయకులపై దాడి చేసిన పాక్ ఉగ్రదాడికి బదులుగానే భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రవాదులపై మండిపడింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పాక్ కు చావుదెబ్బ తగిలిందని ప్రపంచవ్యాప్తంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఐపీఎల్ నిర్వహణపై ఇప్పుడు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ కంటిన్యూ అవ్వడంపై డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్లో ఇప్పటికే 56 మ్యాచులు ముగిశాయి. లీగ్ స్టేజ్లో ఇంకా 14 మ్యాచులు ఉన్నాయి. నాకౌట్, ఫైనల్ కలిపి ఇంకా నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. మే 25న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫైనల్ జరగనుంది. ఇప్పుడిప్పుడే ప్లేఆఫ్స్ వేడి రాజుకొంది. టాప్ 4 కోసం ఏడు జట్లు పోటీలో నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేయాలా? రద్దు చేయాలా? అనేది బీసీసీఐ ముందున్న కఠిన నిర్ణయం. అయితే, తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు రాలేదని బీసీసీఐ ప్రతినిధులు పేర్కొన్నారు.