వేల ఎన్ కౌంటర్లు..వందల మంది హతం..తప్పు చేస్తే అక్కడంతే!
శాంతిభద్రతలు గాడితప్పుతూ.. గూండారాజ్ కొనసాగుతున్న యూపీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘బుల్లెట్ రాజ్’తో బుద్ధి చెబుతున్నారు. శాంతిభద్రతలు కాపాడటంతోపాటు నేరనిర్మూలనే లక్ష్యంగా నేరస్థులపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఒక్క రోజులో 14 ఎన్ కౌంటర్లు జరిగాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ‘‘ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు నేరస్థులపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ అక్కడి పోలీసులు బుల్లెట్ల మోత మోగిస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 15వేల ఎన్కౌంటర్ ఘటనలు నమోదైనట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. అంటే ఎనిమిదేళ్ల కాలంలో దాదాపు 30 వేలమందికిపైగా నిందితులను అరెస్టు చేసి జైళ్లో పెట్టారు. పోలీసులపై దాడి చేసిన ఘటనలకు కొదవలేదు. అందుకే అలా ఎదిరించిన వారి బెండు తీసి చిప్పకూడు తినిపిస్తున్నారు. పోలీసులపై తిరగబడిన కేసుల్లో సుమారు 9వేల మంది కాళ్లకు తుపాకీ గాయాలైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పరారీలో ఉన్నవారు, తరచూ నేరాలకు పాల్పడే వారికోసం చేపట్టిన ఆపరేషన్లలో 238 మంది చనిపోయినట్లు యూపీ రాష్ట్ర డీజీపీ రాజీవ్ కృష్ణ వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ లోని ‘‘మేరఠ్ జోన్లో ఎన్కౌంటర్లు అత్యధికంగా చోటుచేసుకున్నాయి. 7969 మంది నేరస్థులను అరెస్టు చేశారక్కడ. ఆగ్రా జోన్లో 5529 మంది, బరేలీ జోన్లో 4383, వారణాసిలో 2029 మంది నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. కమిషనరేట్ల విషయానికొస్తే.. గౌతమ్బుద్ధ నగర్లో అత్యధికంగా 1983 మంది నేరస్థులను అరెస్టు చేయగా 1180 మందికి గాయాలయ్యాయి. ఘాజియాబాద్లో 1133 మందిని అరెస్టు చేసినట్లు పోలీస్ బాస్ స్పష్టం చేశారు. ఇలా అసాంఘిక శక్తుల పీచమణచడం వల్లే 2017 నుంచి తీసుకున్న కఠిన చర్యలతో ఇప్పు డు దేశంలోనే యూపీ అత్యంత సురక్షిత రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు.