కిడ్నీ రాకెట్.. రంగంలోకి దిగిన సీఐడీ...
సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తును తెలంగాణ సీఐడి ప్రారంభించింది. తొలుత రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ పోలీసులు జనవరి 21న నమోదు చేసిన ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా జీవో జారీ చేయడంతో సీఐడీ పోలీసులు రంగంలోకి దిగారు. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి దందా సాగుతున్నట్లు నమోదైన ఈ కేసులో పోలీసులు ముగ్గురు వైద్యులు సహా పది మంది నిందితులను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన పవన్ అలియాస్ లియోన్ ను ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. వివిధ రాష్ట్రాల లోని నిరుపేదలకు డబ్బు ఆశ చూపించి కిడ్నీ విక్రయించేందుకు ఒప్పించడం కిడ్నీలు అవసరమైన వారిని గుర్తించి తీసుకురావడం అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు తమిళనాడు, కాశ్మీర్ ల నుంచి వైద్యుల్ని రప్పించడం.. వంటివి చేసేవాడు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలతో ముడిపడి ఉన్న ఈ రాకెట్లో పవన్ కీలకమైనా అతడు విదేశాలకు పారిపోయాడనే అనుమానాల నేపథ్యంలో లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. కేసును సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దర్యాప్తు అక్కడితో ఆగిపోయింది.
..ఇప్పటి వరకు 90 ఆపరేషన్లు...
కిడ్నీ ఆపరేషన్లు చేస్తే కమీషన్లు ఇప్పిస్తామంటూ తొలుత విశాఖకు చెందిన లక్ష్మణ్ చిన్న ఆసుపత్రులను ఒప్పించేవాడు. అలా హైదరాబాద్ సైదాబాద్ లోని జనని ఆసుపత్రి వైద్యుడు సిద్దంశెట్టి అవినాశ్ ను ఒప్పించాడు. ఆసుపత్రిని వినియోగించుకున్నందుకుగాను ఒక్కో ఆపరేషన్ కి కమీషన్ కింద అవినాశు రూ.2.5 లక్షలు ఇచ్చేవాడు. అలా జనని ఆసుపత్రిలో 2023-24లలో 40 కిపైగా ఆపరేషన్లు నిర్వహించారు. ఈ క్రమంలోనే అవినాశు.. ప్రధాన నిందితుడు పవన్ పరిచయమయ్యాడు. జనని ఆసుపత్రిని మూసేశాక డబ్బుకు ఆశపడ్డ అవినాశ్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి ఎండీ డా.గుంటుపల్లి సుమంత్ ను ఆపరేషన్లకు ఒప్పించాడు. ఒక్కో ఆపరేషను సుమంత్ కు రూ.1.5 లక్షలు ఇచ్చి.. తను రూ. లక్ష కమీషన్ తీసుకునేవాడు. అలా అలకనంద ఆసుపత్రిలో 20కి పైగా.. అరుణ ఆసుపత్రిలో నాలుగు.. మరో ఆసుపత్రిలో 10కిపైగా ఆపరేషన్లు చేశారు. మొత్తంగా ఈ ముఠా నగరంలో దాదాపు 90 వరకూ ఆపరేషన్లు చేయించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు సీఐడీ ఆ లెక్క తేల్చే పనిలో నిమగ్నమైంది.