బిఆర్ఎస్ బాస్ కి బిగుసుకున్న ఉచ్చు..
కాళేశ్వరం కమిషన్ విచారణలో బిఆర్ఎస్ అధినేతకు పిలుపు
హరీష్ రావుతో సహా ఈటెలకు నోటీసులు
15రోజుల్లో విచారణకు రావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆర్డర్
కాళేశ్వరం విచారణలో కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో బిఆర్ఎస్ బాస్ కి పిలుపు వచ్చింది. దీనితో తెలంగాణ రాజకీయాల్లో ఇక కీలక మలుపు తీసుకోబోతోంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న నాటి నుంచి ఆరోపిస్తున్న కాళేశ్వరం నిర్మాణంలో విచారణ కీలక టర్న్ తీసుకుంది. కమిషన్ కాల పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్న వెంటనే. కేసీఆర్కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్తో పాటు హరీశ్రావు, ఈటల రాజేందర్ లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. వీరు హాజరయ్యేందుకు 15 రోజులు గడువును కమిషన్ ఇచ్చింది. నిర్మాణం వ్యవహారంలో నిజాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు అయ్యింది. దాదాపు ఏడాదిన్నరగా కమిషన్ విచారణ కొనసాగుతోంది. కమిషన్ విచారణ గడువు ఈ నెలాఖరితో ముగియనుంది. అయితే కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు (జూలై 31) వరకు పొడిగిచింది. కమిషన్ విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పనిచేసిన ఏఈలు, డీఈలు, ఎస్ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కమిషన్ విచారించింది. వారి నుంచి అఫిడవిట్లరూపంలో వాంగ్మూలాన్ని స్వీకరించి వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు బహిరంగంగా విచారించింది కమిషన్. ప్రాజెక్టులను నిర్మించిన కంపెనీల ప్రతినిధులను కూడా విచారించింది. అలాగే ప్రాజెక్ట్ డిజైన్లు చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్ ఎంక్వైరీ చేసింది. ఈ ఏడాది పాటు సుదీర్ఘంగా జరిపిన ఈ విచారణలో దాదాపు అందరూ కూడా కేసీఆర్ పేరే చెప్పినట్లు తెలుస్తోంది. బ్యారేజీకి సంబంధించిన స్థలాల ఎంపికను ఎవరు చేశారని ప్రశ్నించగా ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరునే ప్రస్తావించినట్లు సమాచారం. స్థలాల ఎంపిక, బ్యారేజీలకు సంబంధించి కీలక నిర్ణయాలు, చెల్లింపుల నిర్ణయాల్లో కూడా ఆనాటి సీఎం కేసీఆర్, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రమేయంతో జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిష న్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు వచ్చిన ఆధారంగా వచ్చిన వివరాలతో ఓ నివేదికను కూడా సిద్ధం చేసింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్ ను విచారించాలని కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగానే కేసీఆర్ సహా హరీష్ రావు, ఈటెలకు నోటీసులు పంపించింది. జూన్ 5లోపు వీళ్లు కమిషన్ ముందు హాజరై కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా జస్టిస్ పీసీ ఘోష్ నోటీసుల్లో పేర్కొన్నారు. జూన్ 5 లోపు వాళ్లు ఎంచుకున్న తేదీ అయినా లేదా కమిషన్ నిర్ణయించిన తేదీల్లో విచారణ హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు కమిషన్ నిర్దేశించిన విధంగా కేసీఆర్ విచారణకు హాజరవుతారా.. లేక, న్యాయపరంగా అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తారా అనేది కీలకంగా మారబోతోంది. అయితే కేసీఆర్, హరీష్, ఈటెల కు నోటీసుల జారీ తో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.