మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు
బీజేపీ నాయకుడు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది.ఘట్కేసర్ మండలం కొర్రెముల ప్రాంతంలోని శ్రీహర్ష కన్స్ట్రక్షన్కు చెందిన ఒక సెక్యూరిటీ గార్డుపై ఈటల రాజేందర్ చేయి చేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఘటనకు సంబంధించి బాధితుడైన సెక్యూరిటీ గార్డు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోచారం ఐటీ కారిడార్ పోలీసులు గతంలో ఈటలపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ ఈటల రాజేందర్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, వాటి ఆధారంగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అందువల్ల, ప్రస్తుత దశలో కేసును కొట్టివేయడం సముచితం కాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమర్పించిన వాదనలతో ఏకీభవించింది. ఈటల రాజేందర్పై నమోదైన కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను సంబంధిత దిగువ కోర్టులోనే ఎదుర్కోవాలని ఈటల రాజేందర్కు సూచిస్తూ, ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.