ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం
ఎక్సైజ్ ఎన్ఫొర్స్మెంట్ పని తీరు ప్రజలకు ప్రామాణికంగా ఉండాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ నూతన డైరెక్టర్ ఐఏఎస్ షానవాజ్ ఖాసిం అన్నారు. గురువారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా షానవాజ్ ఖాసిం తన ఛాంబర్ లో పదవీ బాధ్యతలను చేపట్టారు.
అబ్కారీ భవన్కు తొలిసారిగా డైరెక్టర్గా వచ్చిన షానవాజ్ ఖాసింకు ఇన్చార్జ్ అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ సయ్యద్ ఖురేషి జాయింట్ కమిషనర్ కేఏబీ శాస్త్రీ, నాలుగురు ఎస్టి ఎఫ్ టీమ్లు స్వాగతం పలికారు. తెలంగాణను 'డ్రగ్ ఫ్రీ' రాష్ట్రంగా మార్చడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రాపిక్ పదార్థాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం కొనసాగుతున్న డ్రైవ్ కొనసాగించాలన్నారు. శాస్త్రీయ దర్యాప్తు విధానాలను అనుసరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. శిక్షా రేటును పెంచి, నేరస్థులలో భయాన్ని కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా స్వేదనం చేసిన మద్యం (గుడుంబా) నేరాలు రాష్ట్రంలోని కొన్ని చోట్ల కొనసాగుతున్నాయని వాటిని నిర్మూలించడంపై దృష్టి పెట్టాలని డైరెక్టర్ తెలిపారు. నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) ప్రభుత్వ ఆదాయాన్ని ప్రత్యక్షంగా గండి కొడుతుందిని, కొన్నిసార్లు ఇలాంటి మద్యం ప్రజారోగ్య సమస్యలకు కూడా దారి తీయవచ్చు అన్నారు. NDPL ఇన్ఫ్లోను పూర్తిగా కట్టడి చేయడం, రాష్ట్రంలో దాని రవాణా మరియు అమ్మకాల కట్టడికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కల్లును కల్తీ చేయుటకు ఉపయోగించే ముడి కల్తీ పదార్థాల వినియోగాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని సూచించారు. స్వాధీనం చేసుకున్న నిషిద్ధ వస్తువులు, వాహనాలను త్వరితగతిన డిస్పోస్ చేయలని, శాఖ పనితీరులో క్షేత్రస్థాయిలో ప్రభావాన్ని చూపించడానికి, కనిపించే మార్పును తీసుకురావడానికి శాఖ యొక్క పనితీరుపై దృష్టి పెట్టడం, ప్రజలతో మెరుగైన సంబంధాలు నెలకొల్పడంలో అందరూ ముందుండాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న టోల్-ఫ్రీ నంబర్ (1800-425-25-23) తో పాటు, ప్రజల ఫిర్యాదులను స్వీకరించడానికి ఆటోమేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయబడుతుందని. ఫిర్యాదులను ప్రతిరోజూ వ్యక్తిగతంగా సమీక్షించడం జరుగుతుందన్నారు. వారపు మరియు నెలవారీ పనితీరు బులెటిన్లను వరుసగా ప్రతి శనివారం మరియు తదుపరి నెల మొదటి రోజున తయారు చేసి విడుదల చేయడం చేస్తామన్నారు.