సంధ్యథియేటర్ తొక్కిసలాట ఘటన.. ఆస్పత్రి నుండి శ్రీ తేజ్ డిశ్చార్జ్
గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్, దాదాపు ఐదు నెలల సుదీర్ఘ చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉండటంతో, వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేసి, తదుపరి సంరక్షణ కోసం రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలని సూచించారు. 'పుష్ప-2' చిత్రం ప్రచార కార్యక్రమంలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి మరణించిన విషయం తెలిసిందే. శ్రీతేజ్ మొత్తంగా 4 నెలల 25 రోజుల పాటు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. 15 రోజుల క్రితం ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చినట్లు అతని తండ్రి భాస్కర్ తెలిపారు. బాలుడి ఆరోగ్యం ఇన్ఫెక్షన్లు లేకుండా నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు. అయితే, ఫిజియోథెరపీ, సంరక్షణ కోసం రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడ సుమారు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ అందించిన తర్వాత ఇంటికి తీసుకెళ్లవచ్చని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీతేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి తండ్రి భాస్కర్ మాట్లాడుతూ, "బాబు ఇప్పుడు కళ్లు తెరిచి చూస్తున్నాడు. ద్రవాహారాన్ని పైపు ద్వారా అందిస్తున్నాం. అయితే, మెదడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మమ్మల్ని ఎవరినీ గుర్తుపట్టడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉంటే ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుందని, రిహాబిలిటేషన్కు వెళితే కొంత మెరుగుదల ఉండొచ్చని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. శ్రీతేజ్ను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని భాస్కర్ తెలిపారు. తమకు అండగా నిలిచిన వారికి భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. "పుష్ప-2 చిత్ర యాజమాన్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం మాకు ఎంతగానో సహాయం చేశారు. బాబు ఆస్పత్రిలో చేరిన రెండో రోజు నుంచే మాకు అండగా నిలిచారు. కిమ్స్ యాజమాన్యం, వైద్యులు కూడా చికిత్స విషయంలో ఇప్పటివరకు డబ్బుల ప్రస్తావన తేలేదు. డిశ్చార్జ్ సమయంలో కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు" అని భాస్కర్ వివరించారు