బాల్య వివాహాల నివారణపై మత పెద్దలకు అవగాహన కార్యక్రమం!
-ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ.
శ్రీకాళహస్తి TPN : అక్షయ తృతీయను పురస్కరించుకొని బాల్యవివాహాలు జరగబోతాయని ముందస్తు ఆలోచనతో భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో మరియు జిల్లాలలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాలు, చర్చిలు, మసీదులలోని మత పెద్దలతో కలిసి బాల్య వివాహాల పైన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.
దీనిలో భాగంగా తిరుపతి జిల్లాలో ప్రగతి సంస్థ మత పెద్దలతో కలిసి బాల్య వివాహాల పైన అవగాహన సదస్సు ఏర్పరిచి, బాల్య వివాహాల వలన కలిగేటువంటి నష్టాలను మరియు వాటికి సంబంధించిన చట్టాల గురించి వివరించారు. బాల్య వివాహాలు నిర్మూలించడంలో మత పెద్దలు అయినటువంటి పురోహితులు, పాస్టర్లు మరియు హజరత్ లాంటివారు సహకరించాలని మరియు మన సమాజాన్ని బాల్య వివాహాలు లేని సమాజంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరం భాగస్వామి అవ్వాలని వారందరితో కలిసి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేపించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ కెవి రమణ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కొరకు బాల్య వివాహాలను నివారించుటకు ప్రగతి స్వచ్ఛంద సంస్థ గత 20 సంవత్సరాలుగా కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. అక్షయ తృతీయ అనేది భారత దేశంలో కొన్నిచోట్ల పెళ్లిళ్ల సీజన్ గా పరిగణిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బాలల హక్కుల పరిరక్షణ కోసం దేశంలోనే అతిపెద్ద ప్రజా సంఘాల నెట్వర్క్ అయిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (జేఆర్సీ) లో భాగస్వామమైనటువంటి ప్రగతి సంస్థ బాల్య వివాహాలను నివారించడానికి వివిధ మత పెద్దలతో అవగాహనా కార్యక్రమం చేపట్టామని, మత పెద్దల నుంచి అందుతున్న సహకారం, మద్దతు అమోఘమని ఆయన పేర్కొన్నారు. మత పెద్దల సహకారంతో ఈ అక్షయ తృతీయకు జిల్లాలో ఒక్క బాల్యవివాహం కూడా జరగదన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు మత పెద్దలకు కూడా అవగాహన కలిగించి వారి సహకారంతో పూర్తిగా బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమం సాధ్యపడుతుందని, వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నామని ఆయన తెలిపారు.
వివాహమంటే పిల్లలపై అత్యాచారం తప్ప మరొకటి కాదని ఆయన తెలియజేశారు .పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయితో మరియు 21 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ ఉన్న అబ్బాయిలతో పెళ్లి అనే పేరుతో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం నేరమని మరియు ఈ వయసుగల పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వివాహం చేయకూడదని ఒకవేళ అలాంటి వివాహాలు జరిపిస్తే దానికి కారకులైనటువంటి యువతీ యువకుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఆ వివాహానికి కావలసిన సౌకర్యాలను సమకూర్చినటువంటి ప్రతి ఒక్కరి పైన మరియు వివాహాన్ని జరిపించడానికి దోహదపడిన గుడిలో పురోహితులను, చర్చిలో పాస్టర్లను, మసీదులో హజరత్ల పైన కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన వివరించారు.
నేడు జిల్లాలోని దేవాలయాలు, మసీదులు మరియు చర్చిలు ముందు బాల్యవాహాలు చేయరాదని స్పష్టంగా రాసి ఉన్న హెచ్చరిక బోర్డులు ఉంచామని తెలియజేశారు. లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడానికి ఫోక్సు చట్టం మరియు ఇతర చట్టాలతో పాటు స్వచ్ఛంద సేవ సంస్థలు, పోలీస్ వారు, మీడియా, మరియు వివిధ రకాల సంస్థలు కఠినంగా పనిచేస్తున్నారని ఆయన వివరించారు. 2030 నాటికి మన దేశాన్ని బాల్య వివాహ రహిత భారతదేశం గా తీర్చిదిద్దరంలో మనమందరం భాగస్వామ్యం అవ్వాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజారెడ్డి, మండల కోఆర్డినేటర్ ప్రభాకర్, రాష్ట్ర యానాది సంఘం అధ్యక్షులు చందమామల కోటయ్య, కమ్యూనిటీ సోషల్ వర్కర్స్ మధు కుమార్, లతా మరియు మల్లికార్జున పాల్గొన్నారు.