పీహెచ్డీ పేరుతో పంగనామాలు..!
బెస్ట్ యూనివర్సీటీ అక్రమాలు..!!
- బెస్టు యూనివర్సీటీ పేరుతో విద్యార్థులకు టోకరా
- పీహెచ్డీ పేరుతో పంగనామాలు పెట్టిన నిర్వాహకులు
- వేల సంఖ్యలో మోసపోయిన బాధితులు
- ఆన్లైన్లో పీహెచ్డీ అంటూ కోట్ల రూపాయల వసూళ్లు
- నకిలీ సర్టిఫికెట్లతో నిలువునా మోసాలు
- యూజీసీ అనుమతి లేకుండానే తప్పుడు అడ్రస్సులతో నిర్వాకాలు
- తెలుగు రాష్ట్రాల్లో నిర్వహకులపై కేసులు నమోదు
- నిందితుల కోసం గాలిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు
మీరు పీహెచ్డీ చేయాలని భావిస్తున్నారా..? టైమ్ లేక ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవుదామని ఆలోచిస్తున్నారా..? ఐతే.. మీరు నిలువునా మోసపోయే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త..! తాజాగా బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సీటీ బాగోతాలు బయటపడ్డాయి. అడ్డదిడ్డంగా దోచుకొని నకిలీ సర్టిఫికెట్లతో బోల్తో కొట్టించింది బెస్ట్ యూనివర్సిటీ. పీహెచ్డీ పేరుతో విద్యార్థులకు పంగనామాలు పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఈ బెస్ట్ యూనివర్సిటీ బారినపడి మోసపోయి పోలీస్స్టేషన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
ఇదిగో ఇదే సాక్ష్యం.. బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సీటీ పీహెచ్డీ కోర్సు అంటూ జనాలను నమ్మించి గొంతుకోసింది. మొదట అమీర్పేటలో స్టార్ట్ అయిన ఈ యూనివర్సీటీ.. రెండు రాష్ట్రాల్లో తెగ పాపులర్ అయ్యింది. అయితే అనుకున్న టార్గెట్ పూర్తికాగానే.. అదే వందల సంఖ్యలో విద్యార్థుల నుంచి కోట్లలో ఫీజు వసూలు కాగానే అక్కడి నుంచి బిచాణా ఎత్తివేసింది. ఆ తరువాత నెక్స్ట్ ఆఫీస్ నాగోల్ మెయిన్ రోడ్డులో అంటూ మళ్లీ ఆన్లైన్ క్లాసెస్ అంటూ వ్యాపారం మొదలు పెట్టారు. దీని వెనుక బడా బాబులే ఉన్నా.. వీరికి మాత్రం వారధిగా వీసీ నాగజ్యోతి అనే మహిళ వ్యవహరిస్లున్నట్లు తెలుస్తోంది. ఎదుటివారిని మాటలతో బోల్తా కొట్టించడం.. ఆ తరువాత ఆఫీస్లు షిఫ్ట్ చేయడంలో ఈమెను మించిన వారు లేరని టాక్.
ఇక నాగోల్ నుంచి ఉప్పల్ ఐటీ పార్కు పక్కనే ఉన్న అబూకస్ బిల్డింగ్లో మా ఆఫీస్ అంటూ నమ్మిస్తుంది. అయితే ఎక్కడా కలవడం మాత్రం మేడం చేయదు. ఆన్లైన్ క్లాస్.. ఆన్లైన్లోనే టాక్స్ అంటుంది. తమ యూనివర్సిటీకి యూజీసీ సర్టిఫికెట్, లైసెన్సు ఉందంటూ అనేక ఫోటోస్, వీడియోస్ స్టూడెంట్లుగా చేరిన వారికి వాట్సప్లో పంపుతుంది. ఇక నాగజ్యోతి మాటలకు మోసపోయి లక్షలు గుమ్మరించిన వారికి మాత్రం ఓ కండీషన్ ఉంటుంది. అదే క్లాసెస్ అవుతున్నప్పుడు రికార్డింగ్లు కానీ, యూనివర్సిటీ గురించి సోషల్ మీడియాలో కానీ ఎక్కడా పోస్టు చేయవద్దని, అలా చేస్తే సర్టిఫికెట్ ఇవ్వమంటూ బెదిరిస్తుంది. లక్షలు గుమ్మరించిన స్టూడెంట్స్ భయపడి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే తాజాగా ఈ విషయాలు వెలుగు చూాశాయి. నిజానికి ఈ సంస్థకు ఎక్కడా ఆఫీసులు ఉండవు. తమ వ్యక్తి ఓ ప్రాంతానికి వెళ్లి కొన్ని ఫొటోలతో ఆయా ప్రాంతాల్లో ఓ ఏరియా సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో అడ్రస్సు ఉన్నట్లు అప్లోడ్ చేస్తారు.
పీహెచ్డీ పూర్తయిన స్టూడెంట్స్ అందరూ సర్టిఫికెట్ల కోసం ఒత్తిడి తేవడంతో.. గత్యంతరం లేక వారికి అందరికి పీహెచ్డీ పత్రాలు అందించారు. అవి చేతబట్టుకొని ఉద్యోగాల్లో ప్రమోషన్లు, గవర్నమెంట్ జాబ్స్కి అప్లయ్ చేసుకున్న తరువాత అసలు విషయం బయటపడింది. అవన్నీ నకిలీ సర్టిఫికెట్లు అని.. అసలు బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సీటికి యూజీసీ గుర్తింపే లేదని.. సిటీలో ఎక్కడా ఎలాంటి సంస్థలు ఆఫీసులు లేవని తెలిసింది. ఇంకేముంది వేల సంఖ్యలో ఉన్న బాధితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా పోలీసు స్టేషన్లకు పరుగులు తీశారు. నాగజ్యోతిని పట్టుకుంటే అసలు నిందితులు బయటకువస్తారంటూ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల పోలీసులు నాగజ్యోతి కోసం గాలిస్తున్నారు.
బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ , బటర్ ప్లై యూనివర్సీటీ, ఆ యూనివర్సిటీ.. ఈ యూనివర్సిటీ అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసే వాటి గురించి ఒక్కసారి ఆలోచించాలి. లేదంటే ఇలాంటి మోసాలకు బలై డబ్బు, జీవితాలు నాశనం చేసుకోవడం తప్ప ఏమీ మిగలదు. బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సీటీ వెనుక ఎవరూ ఉన్నారు.. ఎలా మాస్టర్ ప్లాన్ చేసి జనాలను మోసం చేశారో.. ఆ నిందితుల వివరాలు మరో స్టోరీలో తెలుసుకుందాం..