టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్కు పవన్ రిటర్న్ గిఫ్ట్..!
- జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్
- జూన్ 12 హరిహర వీరమల్లు రిలీజ్ డేట్
- పవన్ సినిమా రిలీజ్పై టాలీవుడ్లో కుట్రలు
- పవన్ పేషీ నుంచి సంచలన ప్రకటన విడుదల
- ఇకపై టాలీవుడ్ పెద్దలతో వ్యక్తిగత చర్చలు ఉండవని స్పష్టం
- థియేటర్స్, మల్టీప్లెక్స్లో సౌకర్యాలపై ఆరా
- టికెట్స్ రేట్స్ హైక్కు టాక్స్ చెల్లింపులపై విచారణ
ఏపీలో నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో ఓవైపు వర్షాలు కురుస్తున్నా.. మరోవైపు సినిమా పాలిటిక్స్ మాత్రం తెగ హీట్ పెంచుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు ఓ నలుగురు సుప్రసిద్ధ నిర్మాతలు మోకాలడ్డుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి టాలీవుడ్లో ఇంతకుముందు ఎన్నడూ.. ఎవ్వరికీ కనిపించని సమస్యలు తెలుగు ఇండస్ట్రీ సినిమాలకు కనిపిస్తున్నాయట. అందుకే థియేటర్స్ని బంద్ చేసి తమ హక్కులు సాధించుకోవాలని ఉక్కు సంకల్పం తీసుకున్నారు సదరు బడా నిర్మాతలు. ఈ మేరకు జూన్ 1 నుంచి సినిమా హాళ్లను మూసివేసి తమ నిరసనని ప్రదర్శించాలని డిసైడ్ అయ్యారు. రెండు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్నీ కూడా ఈ నలుగురు నిర్మాతల లీజులోనే నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే.. ఇప్పటివరకు ఏ పెద్ద సినిమా వచ్చినా.. బెనిఫిట్ షోస్తోపాటు టికెట్ రేట్స్ పెంచడం కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకునే ఈ సో కాల్డ్ నిర్మాతలు.. అటు ఐదేళ్ల నుంచి బడ్జెట్ తడిసి మోపెడైన హరిహరవీరమల్లు సినిమాని ఎందుకు విస్మరించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలే పవన్ సినిమా.. అందులోనూ ఆయన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా.. అటు బడా నిర్మాత ఏఎం రత్నం.. ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ.. ఆ నలుగురు నిర్మాతల కూటమి ఈ సినిమాకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ పవన్పై వారికెందుకు అంత అక్కసు అనేదే ఇక్కడ అర్థం కాని ప్రశ్న. వాళ్లని ఎవరు ఎవరిని మేనిప్యూలేట్ చేస్తున్నారు..? వాళ్ల వెనకుండి స్టోరీ నడిపిస్తున్న ఆ బడా వ్యక్తి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే.. పవర్లో ఉన్న పవన్ సినిమానే అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటే.. ఇక చిన్న సినిమాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా దృష్టిసారించింది. అందుకే థియేటర్స్తోపాటు మల్టీప్లెక్స్లను స్ట్రిక్ట్గా మానిటరింగ్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. ఐతే.. థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా..? ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా..? లేదా..? అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు తూనికలు కొలతల అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్తో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో మల్టీప్లెక్సులు, మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియచేయాలని ఇప్పటికే అధికారులను సినిమాటోగ్రఫీశాఖ నివేదిక అడిగింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా రెండుమూడు స్క్రీన్స్గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. వాటి టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉందా..? అని ఆరా తీస్తున్నారు.
ఇదే వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కార్యాలయం తాజాగా ఓ సంచలన ప్రకటనని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇండస్ట్రీపై పవన్ కల్యాణ్ ఫైర్ కావడం ఈ వ్యవహారంలోని సీరియస్నెస్ని తెలియజేస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన మొదలై ఏడాది పూర్తయిందని.. సినిమా వాళ్లలో ఎవరైనా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారా..? అని ప్రశ్నించారు. అంతే కాకుండా సినిమా రంగ అభివృద్ధికి ప్రయత్నిస్తుంటే తన సినిమాకే అడ్డంకులా..? అని మండిపడ్డారు. మరోవైపు జూన్ 12న పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కొందరు కావాలనే థియేటర్ల బంద్కు కుట్ర చేశారని ప్రచారం జరుగుతోంది. తాజాగా పవన్ కార్యాలయం వచ్చిన ప్రకటనతో.. ఇది నిజమని ఇండస్ట్రీ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. దీంతో.. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న పవన్.. టాలీవుడ్ పెద్దల రిటర్న్ గిఫ్ట్కు కరెక్టు సమాధానం ఇవ్వాలని డిప్యూటీ సీఎం డిసైట్ అయ్యారట. అందుకే ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని.. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని స్పష్టం చేశారు. దీంతో టాలీవుడ్ పెద్దలు అనవసరంగా కొరివితో తల గోక్కున్నామా..? అని పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఏదో చేయాలని ప్లాన్ చేస్తే.. అసలుకే ఎసరు వచ్చిందని తలలు పట్టుకుంటున్నారట. మరి ఈ వివాదానికి పుల్స్టాప్ పడుతుందా..? ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా..? అన్నది వేచి చూడాలి.