ఆడవారి ఆత్మగౌరవం దెబ్బతీశారు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆడబిడ్డల పరువు తీసి తెలంగాణ రాష్ట్రమే కాదు, భారత దేశ మహిళల పరువును ప్రపంచం ముందు తీసిన సంఘటన ఇది. వీర వీరవనితలు రాణి రుద్రమదేవి, సమ్మక్క - సారలమ్మలు పుట్టిన నేలపైనే ఈ ఘోర అవమానం జరగడం చాలా బాధాకరం. తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం, తుడిపించడం దుర్మార్గమైన, అవమానకరమైన, అత్యంత హీనమైన చర్య. యావత్ మహిళ లోకానికి ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆమె ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని, తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేసి మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచుతామని గొప్పగా చెప్పే ప్రభుత్వం విదేశీయుల కాళ్లు కడిగించటం ద్వారా ఏ సంకేతాలు ఇస్తున్నారని ఒకవైపు రాష్ట్రంలోని మహిళలు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడుస్తుంటే, మరోవైపు విదేశీ అందగత్తెలకు తమ కాళ్లు కడిగి, టవల్తో తుడిపించడం దేనికి సంకేతం ఇస్తుందని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిషన్ భగీరథతో మహిళల నీటి కష్టాలు తీరిస్తే, నేడు నీటి కష్టాలు తెచ్చి పాత రోజులు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని, కానీ ఆడబిడ్డల గౌరవాన్ని తగ్గించిన ఏ ఒక్కరు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదన్నారు. అదేవిధంగా మహిళల ఉసురు తగిలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పతనం అవ్వటం ఖాయంమన్నారు. మహిళలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.