తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం తాజాగా పొడిగించింది. తదుపరి విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటివరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం, తీర్పు కోసం ఒత్తిడి చేయవద్దని టీజీపీఎస్సీకి సూచించింది. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ ఎం. పరమేశ్తో పాటు మరో 20 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు, ఏప్రిల్ 17న నియామకాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది రచనా రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తరఫున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలను వినిపించారు. రీకౌంటింగ్ ప్రక్రియలో ఒక అభ్యర్థికి ఏకంగా 60 మార్కులు తగ్గాయని రచనా రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, సదరు అభ్యర్థికి సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలని టీజీపీఎస్సీని ఆదేశించారు. తదుపరి విచారణలో పత్రాలు సమర్పిస్తామని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో, వెకేషన్కు ముందే స్టేపై నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ సూచించిన విషయాన్ని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే, ఈ కేసు వేలాది మంది అభ్యర్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్నందున, విచారణను వేగంగా ముగించలేమని జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. తొందరపడి నిర్ణయం తీసుకోలేమని, తీర్పు కోసం ఒత్తిడి చేయవద్దని సూచించారు. అనంతరం, తదుపరి విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.