వైభవంగా మొదలైన సరస్వతి పుష్కరాలు..
కాళేశ్వర పుణ్యక్షేత్రంలో త్రివేణి సంగమం పుష్కర శోభ
ఈనెల 26వరకు కొనసాగనున్న పుష్కరాలు
ఆశ్రమం పీఠాధిపతి మాదవానంద స్వామిచే మొదలైన పుణ్య స్నానాలు
పుష్కర స్నానాలు చేసిన సీఎం..మంత్రులు
86మీటర్ల పొడవుతో నూతనంగా నిర్మించిన సరస్వతి ఘాట్
కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం పుష్కర శోభ సంతరించుకుంది. ఈ ఉదయం తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుష్కర స్నానాలు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు మొదలైన సరస్వతీ పుష్కరాలు ఈ నెల 26 వరకు సాగనున్నాయి. కాళేశ్వ రం వద్ద త్రివేణీ సంగమంలో పుష్కర స్నానం.. ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానం చేశారు. ఈ సారి ఈ పుష్కరాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.
పుష్కర సందడి....
తెలంగాణ ప్రభుత్వం పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్తేత్రం కాళేశ్వరంలో పుష్కర సందడి మొదలైంది. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడంతో త్రివేణీ సంగమం లో ఈ పుష్కరాలు నిర్వహిస్తున్నారు. దక్షిణాదిన సరస్వతీ పుష్కరాలు కాళేశ్వరంలోనే జరగడం విశేషం. ప్రాణహితకి రెండేళ్ల క్రితం పుష్కరాలు జరగ్గా, ఈసారి సరస్వతి నదికి, 2027లో గోదావరి పుష్కరాలు ఇలా మూడుసార్లు పుష్కరాలు జరుగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద కొత్తగా నిర్మించిన సరస్వతి ఘాట్, భక్తుల కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభించారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శిం చుకున్నారు.
పుష్కర ఘాట్లు - ఏర్పాట్లు...
పుష్కర ఘాట్లని సర్వాంగం సుందరంగా తీర్చిదిద్దారు. జ్ఞాన సరస్వతిఘాట్ను 86 మీటర్ల పొడవుతో నూతనంగా నిర్మించారు. కోటి రూపాయలతో తమిళనాడులోని మహబలిపురం నుంచి సరస్వతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఘాట్ వద్ద ప్రతిష్ఠించారు. సాధారణ భక్తుల వసతి కోసం 50 టెంట్లతో టెంట్ సిటీ సిద్ధం చేశారు. ప్రతిరోజూ లక్షమందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు తీరంచెంత యాగాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సరస్వతి ఘాట్లో సాయంత్రం 6.45 గంటల నుంచి 7.35 గంటల వరకు ప్రత్యేక సరస్వతి నవరత్న మాల హారతి నిర్వహిస్తారు. రోజూ రాత్రివేళ ప్రవచన కర్తల ప్రవచనాలు కళా, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పుష్కరాల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది.
తరలి వస్తున్న భక్తులు...
సరస్వతీ పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పుష్కరఘాట్లు, తాగునీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుధ్యానికి దేవాదాయశాఖ ప్రాధాన్యం ఇచ్చింది. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు, పందిళ్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం శోభ సంతరించుకుంది. సరస్వతి నది పుట్టిన ప్రదేశం భారతదేశం చివరి గ్రామంగా పేరొందిన ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని మానా గ్రామం. తెలంగాణలోని కాళేశ్వరం, ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల సంగమం ఉంది. దీంతో, ఇక్కడ పుష్కర ఘాట్ల ఏర్పాటు ద్వారా భక్తులకు సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనే అవకాశం కలిగింది.