సామాన్యుల ఇండ్లు నేలమట్టం.. బడాబాబుల ఇండ్లకు అధికారుల దాసోహం
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శెట్టికుంటలో గురువారం మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. శెట్టికుంటలో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు ఉన్న కేవలం సామాన్యులపై చర్యలు తీసుకున్న అధికారులు బడాబాబుల ఇళ్లను మినహాయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గురువారం ఉదయం కూల్చివేత్తలు చేపట్టే సమయంలో కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడి చేయడంతో అధికారులకు కొన్ని ఇండ్లకు మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. చెరువును కబ్జా చేసి ఎటువంటి అనుమతులు లేని నిర్మాణాలు పదుల సంఖ్యలో జరుగుతున్నప్పటికీ అధికారులు కేవలం ఒకరిద్దరిపైనే చర్యలు తీసుకొని కూల్చివేతల కార్యక్రమాన్ని మమ అనిపించినట్లు సమాచారం. అధికారులు నామమాత్రంగానే కూల్చివేతలు చేపట్టారని స్థానికంగా ఆరోపణలు ఎదురైనాయి. రాజకీయ నాయకుల అండదండలు ఉండటం వల్లే మరికొన్ని అక్రమ కట్టడాలను అధికారులు వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.సామాన్యుల ఇండ్లను కూల్చి రాజకీయ పలుకుబడి ఉన్న నిర్మాణాల జోలికి అధికారులు వెళ్లకపోడం సమంజసం కాదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. శెట్టికుంట చెరువులో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కొందరిని టార్గెట్ చేయడం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తూతు మంత్రంగా జరిగిన కూల్చివేతలపై ఇప్పటికైనా పై స్థాయి అధికారులు శెట్టికుంటలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయటపడతాయని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.