భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో చెరువులోకి దూకిన తల్లి
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి నారపల్లిలో కలకలం రేగింది. ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తల్లి లోకనమని సుజాత(32), చిన్న కూతురు వర్షిణి(6) మృతి చెందగా, పెద్ద కూతురు అక్షిత(13), రెండో కూతురు ఉదయ శ్రీ(11) ను రక్షించిన పోలీసులు ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల కమ్మనూరుకి చెందిన లోకమణి నాగరాజు, సుజాత లకు 15సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది. పది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ శివారు ప్రాంతం నారపల్లిలోని మహాలక్ష్మిపురంకాలనీలో జీవనం కొనసాగిస్తున్నారు. నాగరాజు సుజాత దంపతులకు ముగ్గురు కుమార్తెలు. దంపతులకు ఈ మధ్య మనస్పర్ధలు ఏర్పడి తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న నాగరాజు తరచూ గొడవలకు దిగేవాడు. భార్యాభర్తల మధ్య గొడవలు తారా స్థాయికి చేరడంతో నారపల్లిలోని సరస్సులో పిల్లలతో సహా సుజాత దూకి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ప్రమాదంలో తల్లి సుజాత, చిన్న కూతురు వర్షిణి మరణించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పెద్ద కూతురు అక్షిత, రెండో కూతురు ఉదయ శ్రీ ఘట్కేసర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘట్కేసర్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ల సూచన మేరకు గాంధీ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లి సుజాత, చిన్న కూతురు వర్షిని మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.