ఆరోగ్యశ్రీని ఆనారోగ్య శ్రీగా మార్చారు : వైఎస్ షర్మిల
కూటమి సర్కార్పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ రేంజ్లో ఫైరయ్యారు. పేరుకు రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు కూడా దిక్కులేదని ఎద్దేవా చేశారు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదని విమర్శించారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటన్నారు. 9 నెలలుగా పూర్తిస్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా.. వైద్య సేవలు ఆపేదాక చూడటం అంటే.. ఆరోగ్యశ్రీ పై సర్కారుకున్న చిత్తశుద్ది ఏంటో అర్థమౌతోందని చెప్పారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా అని అరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచే.. ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారిందని విమర్శలు గుప్పించారు. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయ్యిందన్నారు.
వైద్య సేవలను విస్తృత పరుస్తామని.. వైద్య రంగంలో అమరావతిని గ్లోబల్ సిటీగా చేస్తామని గొప్పలు చెప్పే చంద్రబాబు.. ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత ఇప్పటి సర్కార్దే అని తెలుసుకోవాలన్నారు. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలిచి.. తక్షణం వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందక ఏ ఒక్కరూ మృతిచెందినా.. అవి కూటమి ప్రభుత్వం చేసిన హత్యలే అవుతాయని గుర్తుపెట్టుకోవాలన్నారు. పేదవారి ఆరోగ్యానికి సంజీవనిలా మారిన ఆరోగ్య శ్రీ పథకానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.