ఎర్రవరం అవంతి కంపెనీలో ఫుడ్ పాయిజన్..!
కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం-పెద్దనాపల్లి గ్రామాల మధ్యలో నిర్మించిన అవంతి కంపెనీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఐత.. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 35 మంది జగ్గంపేట రామచంద్ర ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు డీఎంహెచ్వో నరసింహ నాయక్, ఫుడ్ కంట్రోల్ ఇన్స్స్పెక్టర్ శ్రీనివాస్ జగ్గంపేట రామచంద్ర ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న వారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.. అవంతి కంపెనీలో శనివారం ఉదయం ఫుడ్ పాయిజన్ అయ్యి చికిత్స నిమిత్తం జగ్గంపేట రామచంద్ర ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. అయితే ఈ ఘటన సోమవారం ఉదయం కొంతమంది మీడియా మిత్రుల ద్వారా తెలిసినట్లు తెలిపారు. దీంతో హుటాహుటీనా తరలివచ్చామన్నారు. కంపెనీలో విచారణ చేయగా.. ముందురోజు 10 మంది వర్కర్స్ బయట నుంచి బిరియాని తెచ్చుకున్నారని.. అలాగే అక్కడ క్యాంటీన్లో తిన్న వారికి కూడా వాంతులు, విరోచనాలు అయ్యాయని తెలిపారు. అయితే ఫుడ్ పాయిజన్తో ఎవరికి ప్రాణాపాయం లేదన్నారు. వాంతులు, విరోచనాల తప్ప ఎవరికి ఏం కాలేదన్నారు. అయితే ఫుడ్ పాయిజన్ ఎలాగైందన్న అంశంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే అవంతి కంపెనీలో ఉన్న క్యాంటీన్ విషయంలో కూడా జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నది పరిశీలించి.. ఏదైనా తేడా వస్తే దాని లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. స్థానిక రామచంద్ర ఆసుపత్రి వైద్యాధికారిని.. ఈ విషయం ప్రభుత్వ ఆసుపత్రికి తెలియపరిచారా అన్నదానిపై ఆరా తీయగా.. రాజపూడి పీహెచ్సీకి తెలియపరచడం జరిగిందని.. వారు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారని తెలిపారు.