ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి.
పార్వతీపురం మన్యం జిల్లా. ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారు తెలిపారు. మార్చి 13న గురువారం పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు.
పరీక్షా కేంద్రాల చుట్టూ వున్న పరిసరాలను, తీసుకున్న భద్రతా చర్యలు, పరిక్షలు జరుగుతున్న తీరును జిల్లా ఎస్పీ పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా సమర్ధవంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు మరియు సిబ్బందిని ఆదేశించారు. పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపెరింటెండెంట్స్, ఇతర అధికారులు అనుసరించవలసిన నిబంధనలపై పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాలలో బయట వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు ఉండరాదన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్. అమలులో ఉన్నందున ఎవరు గుంపులుగా ఉండకూడదన్నారు. తగిన ఎస్కార్ట్ తో ప్రశ్నపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో ప్రవేశించే విద్యార్థులు, ఇన్విజిలేటర్ లను, ఇతర సిబ్బందిని తరువుగా తనిఖీ చేసి మొబైల్ ఫోన్ లు, స్మార్ట్ వాచ్ లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.