ప్యాకర్స్ అండ్ మూవర్స్ పేరుతో గంజాయి దందా..!
మేడ్చల్ జిల్లాలో ప్యాకర్స్ మూవర్స్ పేరుతో అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ముఠాను షామీర్పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షామీర్పేట్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బోయిన్పల్లికి చెందిన ప్రదీప్ కుమార్ తన బొలెరో వాహనాన్ని ప్యాకర్స్ మూవర్స్ పని కోసం ఉపయోగిస్తూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన సన్నీ, మనీష్ కుమార్ పరిచయమయ్యారు. దీంతో బొలెరో వాహనానికి డ్రైవర్గా సన్నీ, హెల్పర్గా మనీష్ కుమార్ పనికి కుదిరారు. గత నెల మార్చి 31న ప్రదీప్ కుమార్ హర్యానా రాష్ట్రానికి చెందిన సాహిల్తో కలిసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి.. అక్కడ సుభాష్ అనే వ్యక్తిని కలిసి 273 కిలోల గంజాయి కోసం లక్ష 30 వేల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించాడు. ఐతే.. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా హర్యానాకు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారని పక్క సమాచారంతో.. షామీర్పేట్ ఓఆర్ఆర్ దగ్గర ఎస్వోటీ, సైబరాబాద్ పోలీసుల బృందం సంయుక్తంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న గంజాయి పట్టుకున్నారు. ముగ్గురిని షామీర్పేట్ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 273 కిలోల గంజాయి, బొలెరో వాహనం, మొబైల్ ఫోనులు, జియో డాంగిల్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ప్రజలు గంజాయ అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 9490617444 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.