బార్ల ఎంపికకు డేట్ ఫిక్స్.. షరతులు వర్తిస్తాయి..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం, డేట్ రెడీ అయ్యింది. ఈ నెల 13న బార్ల లబ్దిదారుల ఎంపిక జరుగనుంది. 28 బార్లకు లాటరీ పద్దతిలో సెలక్షన్ చేస్తామని జీహెచ్ఎంపీ పరిధిలో 24 బార్లకు 3520 దరఖాస్తులు, రూరల్ 4 బార్లకు 148 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరి కిరణ్ జీహెచ్ఎంసీ, రూరల్ జిల్లాల్లో మూత పడిన బార్ల పునరుద్దరణకు నోటిపీకేషన్ విడుదల చేశారు. అన్ని బార్లకు వచ్చిన దరఖాస్తుల్లోంచి లాటరీ పద్దతి లబ్దిదారులను ఎంపిక చేయడానికి ఎక్సైజ్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 13న జరిగే బార్ల డ్రాకు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్, రంగారెడ్డి డిప్యూటి కమిషనర్లు కేఏబీ శాస్త్రీ, పి.దశరథ్ తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు ‘‘ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ ’’ నార్సింగి, గండిపేట్ హైదరాబాద్లో దరఖాస్తుల దారుల సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరి కిరణ్ డ్రా పద్దతిలో బార్ల లబ్దిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు. డ్రాకు వచ్చే దరఖాస్తుదారులు వారికి సరపరా చేసిన ఎంట్రీ పాసుతోపాటు అవసరమైన నిర్థారణ ప్రూఫ్ తో రావాలని సూచించారు. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటల నుంచి కన్వెన్షన్ హాల్కు రావచ్చునని తెలిపారు. లోపలికి వచ్చే వారి సెల్ ఫొన్లను అనుమతించబడవని అన్నారు. దరఖాస్తుదారులకు ఇచ్చిన టోకన్ నెంబరు ఆధారంగా లోపలికి అనుమతిస్తారని తెలిపారు. ఈ మేరకు దరఖాస్తు దారులు అందరికీ వారి మెయిల్ ద్వారా వాట్సాప్ గ్రూపులో సమాచారాన్ని పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే తీరులో సరూర్నగర్, జల్పల్లి మునిసిపాలిటీలో బార్కు దరఖాస్తు చేసుకున్న 57 మంది దరఖాస్తుదారుల సమక్షంలో రంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణరెడ్డి డ్రా పద్దతిలో బారు లబ్దిదారుడి ఎంపిక చేస్తారని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో ఒక బారుకు వచ్చిన 49 దరఖాస్తుల్లోంచి మహబూబ్నగర్ కలెక్టరేట్లో కలెక్టర్ విజయేంద్రబోయి లబ్దిదారుల సమక్షంలో డ్రా పద్దతిలో బార్ లబ్దిదారుడిని ఎంపిక చేస్తారు. నిజామాబాద్, బోధన్ బార్లకు వచ్చిన 42 దరఖాస్తుదారుల సమక్షంలో నిజామాబాద్ కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్ కిరణ్ కుమార్ బార్ల లబ్దిదారులను డ్రా పద్దతిలో ఎంపిక చేస్తారు.