వికారాబాద్ జిల్లా పోలీస్ అధికారులతో డీజీపీ జితేందర్ రివ్యూ

On
వికారాబాద్ జిల్లా పోలీస్ అధికారులతో డీజీపీ జితేందర్ రివ్యూ

  • మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశం
  • వీకెండ్ లలో ఫామ్ హౌస్, రిస్టార్ ల వద్ద నిఘా పెంచాలి..
  • నేరాల నియంత్రణలో అలసత్వం అస్సలు వద్దు..

వికారాబాద్: జిల్లాలో శాంతిభద్ర పరిస్థితిని రాష్ట్ర డైరెక్టర్ జనరల్  ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ సమీక్షించారు. శాంతి భద్రతల పరిస్థితిలను సమీక్షించేందుకు డీజీపీ జితేందర్ వివిధ జిల్లాలను పర్యటిస్తున్న నేపథ్యంలో మంగళవారం నాడు వికారాబాద్ జిల్లా పోలీస్ అధికారులతో రివ్యూ చేపట్టారు. ఈ సమీక్ష  సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పలు ఆదేశాలు జారీ చేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై (Long Pending UI cases) ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తరచుగా నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై రికార్డులు పక్కాగా నమోదు చేసి, వారి నేర చరిత్రను బట్టి రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్ తెరవాలని లేదా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రో-యాక్టివ్ పోలీసింగ్‌ను పటిష్టంగా అమలు చేయడం ద్వారా నేరాలు జరగకముందే అడ్డుకట్ట వేయాలని సూచించారు. అదేవిధంగా, పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన దొంగతనం కేసులను త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ చెప్పారు. జిల్లాలో NDPS కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు రాష్ట్రంలో లేకుండా నిర్మూలించాలని అన్నారు. సరిహద్దు పోలీస్ స్టేషన్ల అధికారులు మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతరం దాడులు నిర్వహించి మత్తు పదార్థాలను పూర్తిగా అరికట్టాలని తెలిపారు. ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించి వ్యాపారం చేసే వారిని, ఇసుక మాఫియాను, మట్కా, గేమింగ్ వంటి జూదాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, రాత్రి వేళల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
మహిళలు, పేద వర్గాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీ గారు స్పష్టం చేశారు. మహిళలపై నేరాలు, పోక్సో (POSCO) చట్టం కింద నమోదైన కేసులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి, పకడ్బందీ దర్యాప్తు ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని హాట్ స్పాట్లను గుర్తించి ఆర్‌టి‌ఏ, రెవెన్యూ,ఆర్&బి మరియు ఇతర అధికారులతో కలసి రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, "మనకు ఒక ప్రమాదం కేవలం ఒక సంఖ్య మాత్రమే కావచ్చు, కానీ దాని వల్ల ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతుంది" అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణలో సీసీటీవీల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలను చైతన్యపరచాలని, ఇప్పటికే ఉన్నవి పనిచేసేలా చూసి, మరమ్మతులుంటే వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు.
పోలీసులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలని డీజీపీ  పేర్కొన్నారు . ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, 'డయల్ 100'కు వచ్చే కాల్స్‌పై తక్షణమే స్పందించాలన్నారు. పోలీస్ స్టేషన్లలోని అన్ని ఫంక్షనల్ వర్టికల్స్‌లో అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేయాలని సూచించారు. తాము చేసిన పనిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ, ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
వికారాబాద్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు,ఫార్మ్ హౌస్ లు , వీకెండ్ లలో జరిగే పార్ఠీలపైనా ప్రత్యేక నిఘా పెట్టాలని డి‌జి‌పి  పేర్కొన్నారు.అన్నింటికన్నా ముఖ్యంగా, కేసులలో కన్విక్షన్ (నేర రుజువు) శాతాన్ని గణనీయంగా పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని డీజీపీ గారు తెలిపినారు. ఈ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా జిల్లాలో శాంతిభద్రతలను కాపాడి, ప్రజలకు మరింత భద్రతను కల్పించాలని, జిల్లాకు, తెలంగాణ రాష్ట్ర పోలీస్ కు మంచి పేరు తీసుకొని రావాలని డి‌జి‌పి తెలిపారు.
మల్టీ జోన్ – 2 ఐజీపీ వి. సత్యనారాయణ,  చార్మినార్ జోన్ డీఐజీ  తస్ఫీర్ ఇక్బాల్ , జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి,  మరియు జిల్లాలోని అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.