రెండోసారి ముగిసింది.. మూడో ఎపిసోడ్ మిగిలే ఉంది..
రెండోసారి 8గంటలపాటు కేటిఆర్ ని విచారించిన ఏసీబీ
మరోసారి పిలుస్తామంటూ అందుబాటులో ఉండాలని చెప్పిన అధికారులు.
ఈనెల 18లోగా సెల్ ఫోన్స్ అప్పగించాలని ఆదేశం..
ఎనిమిదిగంటల విచారణ.. 60 ప్రశ్నలు.. కొన్నింటికే సమాధానాలు.. మొత్తం వీడియో రికార్డ్.. అరగంట లంచ్ బ్రేక్.. ఆరుగురు అధికారులు.. ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం.. సెల్ ఫోన్ అప్పగించాలని అధికారులు ఆదేశించారు.. చివరగా మళ్లీ పిలుస్తాం.. ఖచ్చితంగా రావాలి.. ఇదే కేటిఆర్ కి ఏసీబీ ఆఫీస్ లో జరిగిన విచారణ. వచ్చి రాగానే అరెస్ట్ పక్కనా.. ఎప్పుడు చేస్తారు.. రెడీగా ఉండాలా అంటూ అధికారులను మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. వరుసగా ప్రశ్నలు అధికారులు అడిగేసరికి సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నాలు చేశాడని తెలుస్తోంది. అయిన పట్టువిడవని అధికారులు ఆయన నుండి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ ముగిసింది. ఎనిమిది గంటల సుదీర్ఘ విచారణ చేశారు ఏసీబీ అధికారులు. ఉదయం 10 గంటలకు తన న్యాయవాదితో కలిసి బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలోకి మరోసారి వెళ్లారు. ఆయన వచ్చాడని తెలియగానే ఏసీబీ ఆఫీసుకు డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి, డీఎస్పీ మాజిద్ ఖాన్, రితిరాజ్ ఆయనను ప్రశ్నించారు. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, ఏ2గా అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ ఈఈ బీ.ఎల్. ఎన్. రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురినీ ఏసీబీ గతంలో విచారించింది. ఇప్పుడు కేటీఆర్ ను రెండోసారి విచారించింది. అర్వింద్ కుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్లు, ఏసీబీ సేకరించిన ఆధారాలను బేస్ చేసుకుని కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో క్రాస్ క్వశ్చన్ చేసినట్లు సమాచారం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ఏ హోదాలో ఫండ్స్ రిలీజ్ కోసం ఆదేశాలు జారీ చేశారని కేటీఆర్ ను ప్రశ్నించినట్టు సమాచారం. ఈ క్రమంలో అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి స్టేట్ మెంట్లను బేస్ చేసుకుని అధికారులు ప్రశ్నించారు. కేటీఆర్ ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు దాన కిషోర్ స్టేట్ మెంట్ ఆధారంగా చేసుకుని అర్వింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఎఫ్ వోతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై ఆరా తీశారు. కేబినెట్ ఆమోదం, ఆర్థికశాఖ అనుమతి లేకుండా 44కోట్ల రూపాయలు నగదు ఎందుకు బదిలీ చేశారని.. ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపైనా ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సేకరించిన సాక్ష్యాలు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ముందుంచి ఏసీబీ ప్రశ్నించినట్లు సమాచారం.
అయితే అధికారులు అడిగిన 60 ప్రశ్నల్లో కేటిఆర్ కొన్నింటికే సమాధానం చెప్పారని అధికారులు చెబుతున్నారు. చాలా ప్రశ్నలకు ఆయన దాటవేసే ప్రయత్నం చేశారని, విచారణ మొత్తం వీడియో రికార్డ్ చేసినట్లు అవసరమైతే హైకోర్టుకి అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోసారి కేటీఆర్ ను విచారించాల్సి ఉందన్నారు. అధికారులు చెప్పే వ్యవహారం బట్టి కేటిఆర్ నుండి సరైన సమాధానాలు రాలేదా.. లేక అతను ఇచ్చిన సమాధానాలకు అధికారులు సంతృప్తి చెందలేదని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే మరోసారి విచారణకు ఏసీబీ సిద్ధమైనట్లు సమాచారం. అందుకు కేటిఆర్ కి కూడా తెలిపామన్నారు. ఇక కేటిఆర్ సెల్ ఫోన్ సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. తాను ఫోన్ వెంట తీసుకు రాలేదని చెప్పడంతో జూన్ 18లోపు తను వాడే ఫోన్ తో పాటు, ఈ కార్ రేస్ సమయంలో వాడిన ఫోన్స్ అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు.
మూడు కాదు 30సార్లు పిలిచినా వస్తా..
ఏసీబీ విచారణకు ముందు కేటీఆర్ తమ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న నేతలను కలుసుకొని నేరుగా ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. వచ్చే ముందు మీడియాతో మాట్లాడారు. 3సార్లు కాదు 30సార్లు పిలిచినా వస్తాను అని అన్నారు. ఇదంతా రేవంత్ పొలిటికల్ కక్ష అంటూ సెటైర్లు వేశారు. విచారణకు, అరెస్ట్ లకు భయపడేది లేదని చెప్పారు. విచారణ తరువాత బిఆర్ఎస్ భవన్ వెళ్లిన కేటిఆర్ కేసులకు అరెస్ట్ లకు భయపడేది లేదని జైల్ కి పంపితే రెస్ట్ తీసుకుంటా అంటూ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డిని జైల్ కి పంపాము కాబట్టే మమ్మల్ని పంపాలని చూస్తున్నాడని, ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారు తప్ప అందులో కొత్తగా ఏమి లేదన్నారు. ఏదో విచారణ పేరుతో మమ్మల్ని ఇరకాటంలో పడేసి జైల్ కి పంపాలనే శ్రద్ధ కనపడుతోందని చెప్పారు.
పార్టీ ఆఫీస్ కి తాళం.. నేతల అరెస్ట్..
కేటిఆర్ విచారణ అనే సరికి పెద్ద సంఖ్యలో నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. కేటీఆర్ కి మద్దత్తుగా ఏసీబీ కార్యాలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. బందోబస్తులో ఉన్న పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. నేతల తాకిడి తట్టుకోలేక పార్టీ కార్యాలయానికి తాళం వేసి ఎవరు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఏసీబీ ఆఫీస్ వద్ద నిబంధనలు..
ఏసీబీ కార్యాలయం వద్ద కూడా పోలీసులు నిబంధనలు విధించారు. నేతలు రాకుండా బ్యారికేడ్స్ వేసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. సుమారు 50మీటర్ల మేర నిషేధం విధించి మీడియా కూడా ఆయా పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. కేటిఆర్, ఆయన న్యాయవాదికి చెందిన వాహనాన్ని మాత్రమే అనుమతించారు.
లీగల్ టీమ్ తో హరీష్ రావు భేటి..
కేటిఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావడంతో హరీష్ రావు, ఆర్.ఎస్. ప్రవీణ్ లీగల్ టీమ్ తో భేటి అయ్యారు. మరోసారి కేటిఆర్ ని పిలిచినా ఒకవేళ అరెస్ట్ చేసిన ఎలా ఎదుర్కోవాలో పలు సలహాలు తీసుకున్నారు. మొత్తానికి కేటిఆర్ విచారణ రెండోసారి ముగిసింది. మూడో ఎపిసోడ్ ఇంకా మిగిలే ఉంది.