ఆనందం కాస్త.. ఆవిరైపోయింది..
- బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో విషాదం..
11మంది మృతి..50మందికి గాయాలు..
తొక్కిసలాటతో చోటుచేసుకున్న ప్రమాదం..
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్.
కప్పు గెలిచామన్న ఆనందం లేకుండా పోయింది.. ఏళ్ల తరబడి చేసిన నిరీక్షణ ఒక్క క్షణంలో మంటగలిసి పోయింది. ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన ఆ అభిమానుల కళ్లు.. కన్నీటితో నిండిపోయాయి. అప్పటి వరకు ఉన్న ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకున్న ఆనందం విషాదంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం రాత్రి జరిగిన భారీ తొక్కిసలాటలో 11మంది అభిమానులు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఒక బాలిక కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనతో స్టేడియం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.
ఐపీఎల్ కప్ గెలిచిన తరుణంలో, అభిమానుల సంబరాల కోసం చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యేక సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే, అభిమానులు ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అభిమానులు ఒక్కసారిగా లోపలికి దూసుకు రావడంతో పోలీసులు సైతం పరిస్థితిని అదుపు చేయలేకపోయారని అధికారులు తెలిపారు. తక్కువ సమయంలో ప్రభుత్వం నుంచి అనుమతి రావడం, సరైన ఏర్పాట్లు చేయలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "జనాల్ని చంపేందుకే కప్ సాధించారా?" అంటూ ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్లూ ఆర్సీబీ మాదిరిగా సెలబ్రేషన్స్ చేయలేదని, వారి అతి కారణంగానే అభిమానులు మరణించారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై క్రికెట్, రాజకీయ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.14 ఏళ్ల దివ్యాంశి అనే బాలిక మృతిచెందింది. బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు మొత్తం 50 మంది ఆసుపత్రిలో చేరారు.