బక్రీద్ పండుగ రోజు బలి ఎందుకివ్వాలి.. ఆ చరిత్ర మీ కోసం..
- బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లో జోరందుకున్న విక్రయాలు..
దేశవిదేశాలకు చెందిన ముగజీవాలు విక్రయానికి సిద్ధం..
ముస్లింలు పెద్ద ఎత్తున జరుపుకునే పండుగలలో రంజాన్ తరువాత బక్రీదే..
ముస్లిం సోదరులకు ట్రూ పాయింట్ న్యూస్ బక్రీద్ శుభాకాంక్షలు..
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్.
దేశవ్యాప్తంగా ముస్లింలు ఘనంగా నిర్వహించుకునే పండుగలలో ఒకటైన బక్రీద్ కి వేళయ్యింది. ఇతర ప్రాంతాలతో పాటు నగరంలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మేకలు, గొర్రెలు, పోటేళ్ల విక్రయాలు జోరందుకున్నాయి. శనివారం పండుగ నేపధ్యంలో ఎవరికి వారు తమ శక్తి కొలది కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ బక్రీద్ లో ఓ త్యాగం ఉంది.. అందుకే ఈ పండుగకు బలి ఇస్తారు.. ఆ కధ మీ కోసం..
అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకొనే పండగ బక్రీద్. ఇస్లాం క్యాలెండర్లోని బక్రీద్ మాసంలో 11వ రోజున ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీ. సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనవాళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్ భూమండలానికి 80వేల మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింల ఆరాధ్యగ్రంథం దివ్యఖురాన్ చెబుతోంది. వారిలో ఒకరు ప్రవక్త హజరత్ ఇబ్రహీం. అల్లాహ్పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం గడపాలని మానవాళికి బోధిస్తున్న ప్రవక్తల్లోని విశ్వాసాన్ని కూడా గ్రహించేందుకు అల్లాహ్ అనేక పరీక్షలతో పరీక్షించేవారు. ఈ క్రమంలో ప్రవక్త ఇబ్రహీం అనేక పరీక్షల్లో తన విశ్వాసాన్ని నిరూపించినట్లు పవిత్ర ఖురాన్ పేర్కొంది. ఈ క్రమంలోనే హజరత్ ఇబ్రహీం, ఆయన సతీమణి హజీరాలకు వారి వృద్ధాప్యంలో అల్లాహ్ వారికి సంతానప్రాప్తి కలిగించారు.
లేక లేక జన్మించిన తమ కుమారుడు ఇస్మాయిల్ను వృద్ధ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఒక రోజు రాత్రి ఇబ్రహీం తమ కుమారుడు ఇస్మాయిల్ను అల్లాహ్పేర బలిదానం చేస్తున్నట్లు కలగంటారు. దీంతో అల్లాహ్ తన కుమారుడిని బలిదానం కోరుకుంటున్నారని గ్రహించిన ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ను బలిదానం (ఖుర్బానీ) ఇచ్చేందుకు సిద్ధపడ్తారు. తండ్రి అంతరంగాన్ని గమనించిన కుమారుడు ఇస్మాయిల్ కూడా అల్లాహ్ మార్గంలో బలయ్యేందుకు సిద్ధపడ్తారు. బలి ఇచ్చే సమయంలో పుత్రవాత్సల్యం అడ్డువస్తే. తనకు బలి ఇవ్వకుండా తన తండ్రి వెనకడుగు వేస్తే, అల్లాహ్తో విశ్వాసఘాతకుడిగా నిలవకుండా, కళ్లకు గంతలతో తనను బలిఇవ్వమంటూ తండ్రికి సూచిస్తారు.
ఆ మేరకు అల్లాహ్ నామస్మరణతో తన కుమారుడిని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తిపెట్టిన క్షణంలో త్యాగ నిరతికి మెచ్చిన అల్లాహ్ ఆఖరు క్షణంలో అల్లాహ్ ఇస్మాయిల్ను తప్పించి అదే స్థానంలో ఒక దుంబా (పొట్టేలు) ను ప్రత్యక్ష పరుస్తారు. దీందో పొట్టేలు గొంతు తెగి అల్లాహ్మార్గంలో అది ఖుర్బాన్ అవుతుంది. ఇబ్రహీం త్యాగనిరతిని మెచ్చిన అల్లాహ్ ఆరోజు నుంచి ఈదుల్ అజ్ హా (బక్రీద్) పండగను జంతు బలి ఇవ్వాలనీ, ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలని, నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతోంది.
అందుకే ఆ రోజు బలి ఇవ్వడానికి మేకలు, గొర్రెలు, పోటెల్లను కొనుగోలు చేస్తారు. అలా బలి ఇచ్చినదాన్ని మూడు భాగాలు చేసి పేద వారికి ఒక భాగం, బంధువులు, స్నేహితులకు రెండో భాగం పంచి మిగిలింది వారు తీసుకుంటారు. ఉదయం నుండి కుటుంబ సభ్యులు అందరూ నమాజ్ చదివి ఆ తరువాత బలి చేసి పండుగ మొదలు పెడతారు. రంజాన్ తరువాత బక్రీద్ పండుగ ముస్లింలకు చాలా పెద్ద పండగ.
నగరంలో జొరదుకున్న విక్రయాలు..
ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోటేళ్లు, మేకలు, గొర్రెల విక్రయాలు జోరందుకున్నాయి. నగరం నలుమూలల నుండి కాకుండా జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, విదేశాల నుండి అక్కడి జీవాలను తీసుకు వచ్చి హైదరాబాద్ లో విక్రయాలు జరుపుతారు. వాటిని కొనుగోలు చేసేందుకు సిటీలోని ముస్లింలోని బడా వ్యాపారులు పోటీ పడి వేలంపాటలో దక్కించుకుంటారు. ఇది బక్రీద్ పండుగ చరిత్ర. సో ముస్లిం సోదరులకు, ట్రూ పాయింట్ న్యూస్ పాఠకులకు బక్రీద్ శుభాకాంక్షలు.